రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ: మహేష్ బాబు సోదరి మంజుల వ్యాఖ్య ఇలా
Recommended Video
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై ఓ జేఏసీని కూడా ఏర్పాటు చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో భేటీ అయ్యారు.
త్వరలో ఉండవల్లి అరుణ్ కుమార్తోను మాట్లాడనున్నారు. విభజన హామీల అమలు కోసం పార్టీలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ జేఏసీ పని చేయనుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం నేతృత్వంలో పని చేసిన జేఏసీలో ఇది పని చేసే అవకాశముంది.
పవన్ కళ్యాణ్ ఇప్పుడే బిజీ
పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. నటుడు మహేష్ బాబు సోదరి, నటి, దర్శకురాలు మంజుల కూడా పవన్ సినిమా తీయాలని కోరుకుంటున్నారు.
మంజుల దర్శకత్వంలో సినిమా
ఆమె దర్శకత్వంలో మనసుకు వచ్చింది సినిమా వస్తోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడారు.
పవన్ కళ్యాణ్పై ప్రశంసలు
పవన్ కోసం కథ రాసుకున్నానని, దానికి పవన్ అని టైటిల్ కూడా పెట్టానని మీరు చెప్పారని మంజులను ఓ విలేకరి అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ అవునని, తన తండ్రి, సోదరుడి తర్వాత తాను మెచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు.
మనసుకు నచ్చింది చేస్తారు
తన మనసు ఏది చెబితే పవన్ కళ్యాణ్ అదే చేస్తారని మంజుల అన్నారు. చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి అన్నారు. ఆయన కోసం కథ ఉందని, కానీ ఆయన సినిమాలు చేయరని తనకు తెలుసునని చెప్పారు. కానీ నేను రాసుకున్న కథ ఆయన విన్నారంటే కచ్చితంగా కాదనకుండా చేస్తారని, ఈ సినిమా ఒక్కటి చేసి ఆయన రాజకీయాల్లోకి వెళ్లవచ్చునని, కథ వినమని పవన్కు చెప్పండని మంజుల నవ్వుతూ చెప్పారు.