తెలంగాణ భేష్, దూసుకెళ్తోంది: కేసీఆర్ ప్రభుత్వంపై మన్మోహన్ ప్రశంస
హైదరాబాద్: దేశంలో అత్యుత్తమ పాలన సాగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసించారు. చిన్న వయస్సులోనే తెలంగాణలో పరుగులు పెడుతున్న అభివృద్ధి ఇదేవిధంగా కొనసాగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.
జాతీయ ర్యాంకులు: ఐఐటీ-హెచ్ 9, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 5, ఓయు 23వ స్థానంలో
గురువారం పార్లమెంటు లాబీలో మన్మోహన్కు కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్లను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కేశవ రావు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారితో మన్మోహన్ మాట్లాడారు.
దేశంలో అత్యుత్తమ పాలన సాగుతున్న రాష్ట్రం అని తెలంగాణను మన్మోహన్ మెచ్చుకున్నారని కేశవ రావు మీడియాకు తెలిపారు. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని అభినందించినట్లు చెప్పారు. తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను మన్మోహన్కు కేశవ రావు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిన మన్మోహన్కు టీఆర్ఎస్ ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను మన్మోహన్ అభినందించడం ఆనందంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు.
Recommended Video
కేశవ రావు మాట్లాడుతూ.. మన్మోహన్ అంతటి పెద్ద మనిషి తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.