టెక్నాలజీలో ఏపీ దూసుకెళ్తోంది: 'మన్ కీ బాత్'లో మోడీ, కేసీఆర్ పథకాలపై..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తన మన్ కీ బాత్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలోను కరువు పైన మాట్లాడారు. కరువు ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. కరువు శాశ్వత నివారణకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలలో టెక్నాలజీని వినియోగిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో నగదు రహిత విధానంలోనే ఆర్థిక లావాదేవీలు జరగనున్నాయన్నారు. పాలనలో ప్రజల సూచనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు.
అడవుల పరిరక్షణ, జల సంరక్షణ అందరి బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి నోటిబొట్టును ఒడిసి పట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ లోపమే అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు ప్రభావం ఉన్నట్లు ప్రధాని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నీరు-ప్రగతి, తెలంగాణలో మిషన్ భగీరథ కార్యక్రమాలతో నీటి సంరక్షణ చేపడుతున్నారన్నారు. తక్కువ నీటితో సూక్ష్మసేద్యం వంటి విధానాలతో జలాన్ని సంరక్షించుకోవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ బ్యాంకు ఖాతాదారులున్నారని ప్రధాని మోడీ తెలిపారు.
మొబైల్ ద్వారా ధన మార్పిడి చాలా సులువైన మార్గమన్నారు. ఏపీ, గుజరాత్ రాష్ట్రాలు టెక్నాలజీతో దూసుకుపోతున్నాయని కితాబిచ్చారు. ఒలింపిక్స్లో మన పతకాల పట్టిక చూస్తే మనకు బాధ కలుగుతుందని, ఒక్క ఓటమితో క్రీడాకారులు కుంగిపోకూడదని, దాని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలన్నారు.