నా కూతురుపై అందుకే దాడి చేశా, ఆవేశంలోనే..: మనోహారాచారి, ‘కూతురే టార్గెట్- ఇప్పుడు బాధపడితే’
హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్నదనే కోపంలోనే తన కన్న కూతురిపై దాడి చేసినట్లు మనోహరా చారి తెలిపాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మనోహరా చారి ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. తనకు ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో తన కూతురుపై తీవ్ర కోపం వచ్చిందని తెలిపాడు.
Recommended Video
ఎర్రగడ్డ ప్రేమజంటపై దాడి: ఆ కిరాతక తండ్రిని ఎగిరితన్నిన యువకుడు!
ప్రేమ వివాహం ఇష్టం లేదు
‘నా కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆమె పెళ్లి చేసుకున్నప్పడి నుంచి మద్యం తాగుతూనే ఉన్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు ఇలా ప్రేమ వివాహం చేసుకోవడం నేను జీర్ణించుకోలేకపోయాను' అని మనోహారా చారి తెలిపాడు.
రెండేళ్లున్నప్పుడే హైదరాబాద్కు..
‘నా కూతురికి రెండేళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చాను. అమీర్పేటలోని గోవింద్ నగల షాపులో పని చేస్తున్నాను. నాకు పని కల్పించింది నా బామ్మర్ధి. నా కూతురుకు నేను అనుకున్న వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆమె మరొకర్ని ప్రేమించి వివాహం చేసుకుంది' అని మనోహర్ పేర్కొన్నాడు.
కూతురే టార్గెట్
కాగా, మనోహరా చారి ప్రధాన టార్గెట్ అతని కూతురేనని, ఈ కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీసీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం మూడున్నర గంటలసమయంలో కూతురు మాధవితో పాటు సందీప్పై మనోహరా చారి కత్తితో దాడి చేశాడు. ప్రేమ పెళ్లిని సహించని అతను కక్ష్యతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మనోహరా చారి కూతురినే టార్గెట్ చేసి చంపాలని ప్లాన్ చేశాడు. సందీప్ను
చంపాలనే ఉద్దేశం తనకు లేదని మనోహర్ చారి దర్యాప్తులో వెల్లడించాడు. మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తండ్రి చేతిలో మాధవి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సందీప్కు స్వల్ప గాయాలు అయ్యాయి.
మనోహారాచారికి తెలియకుండా.. ఇప్పుడు బాధపడితే..
మాధవి ప్రేమ వ్యవహారం తనకు తెలియకుండా అతని భార్యా, కొడుకు దాచారని మనోహర చారి విచారణలో చెప్పాడు. ప్రణాళిక ప్రకారమే కూతురుకు కాల్చేసి రమ్మని చెప్పాడని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాని డీసీపీ వివరించారు. ఇలాంటి దాడులు సరికావని, ఒక జీవితం పోతే మళ్లీ తిరిగిరాదని అన్నారు. మాధవి తండ్రి మనోహర్ ఆమెపై దాడి చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాడని తెలిపారు. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్లు సెప్టెంబర్ 12న ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతిన్నాయని.. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శస్త్ర చికిత్స తర్వాత 6..7 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమన్నారు. మాధవికి ఒక చేయి పూర్తిగా తెగిపోయి చర్మంతో వేలాడుతుందని, అతికించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.