ఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరం
పెద్దపల్లి : టీఆర్ఎస్, బీజేపీ పై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. అవి అవలంబించే విధానాలు సేమ్ టూ సేమ్ అని ధ్వజమెత్తారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీధర్ బాబు ఆ రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు.
మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఇంతవరకు ఆ హామీని తుంగలో తొక్కిందని ఆరోపించారు. అంతేకాదు సామాన్యుల నడ్డి విరిచేలా అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఫైరయ్యారు.
టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ వైపు ప్రజల చూపు : మురళీధర్ రావు
కేంద్ర బడ్జెట్లో సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రస్తావనే లేకుండా చేశారని మండిపడ్డారు. ఇక రైతులను పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందన్నారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేకుంటే నిలదీయాల్సిన టీఆర్ఎస్.. ఒక్క మాట మాట్లాడకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీతో నిధులు అవసరం లేదని సీఎం కేసీఆర్ గొప్పలకు పోయారని ఎద్దేవా చేశారు. సొంతంగా పూర్తిచేసుకుంటామని ప్రకటించడం సరికాదని మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ క్యాడర్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లలాగా వ్యవహరించి ప్రజలను భయపెట్టే ఛాన్సుందని ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పనిచేయాలని.. సమన్వయంతో పనిచేయకుంటే ఆ శాఖపై ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు. ఇక ఎర్రమంజిల్ భవనం కూల్చొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.