జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావద్దంటున్న భట్టి... వస్తే తప్పేంది అంటున్న జగ్గుభాయ్!
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే పలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క జగన్ రావడాన్ని వ్యతిరేకిస్తూంటే, పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం జగన్ రావాడాన్ని స్వాగతించారు. దీంతో ఒక్క పార్టీలోనే భిన్న వాదనలు వినిపించడం మరోసారి కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి...
కాళేశ్వరంకు రావడంపై తెలంగాణ కాంగ్రెస్లో భిన్నవాదనలు
తెలంగాణ ప్రభుత్వం ప్రత్రిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న ప్రారంభించబోతుంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి సీఎం జగన్తో పాటు, మహారాష్ట్ర్ర సీఎం ఫడ్నవీస్ను కూడ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కాని జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కు రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జగన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే దివంగత వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని జగన్కు బహిరంగ లేఖ రాశారు.
వైఎస్ హయాంలో రూపకల్పన
ప్రస్థుతం నిర్మితం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేశారని , ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడి హట్టి వద్ద నిర్మించేందుకు రూ. 38 వేల కోట్లతో ఈపీసీ ద్వార అగ్రిమెంట్ కూడ చేసుకున్నారని భట్టి లేఖలో తెలిపారు.కాగా దీనికి బీఆర్ అంబేద్కర్ పేరును కూడ పెట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల కోట్ల రుపాయల ఖర్చు కూడ చేసిందని చెప్పారు.
వైఎస్ చేపట్టిన ప్రాజెక్టుకు పేరు మార్చిన కేసిఆర్
అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో సీఎం కేసిఆర్ దానికి పేరు మార్చరని తెలిపారు. మరోవైపు 152 మీటర్ల ఎత్తున్న ప్రాజెక్టును 100 మీటర్ల ఎత్తులోనే మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నారని అన్నారు. దీంతో నిర్మాణ ఖర్చును కూడ లక్ష కోట్లకు పెంచారని పేర్కోన్నారు. దీంతో జగన్ రావడం వల్ల వైఎస్ ఆత్మక్షోభిస్తుందని లేఖలో పేర్కోన్నారు.
ప్రాజెక్టులు ఎవరు కట్టినా తెలంగాణ ప్రజల కోసమే.. జగ్గారెడ్డి
అయితే భట్టి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. జగన్ ,ఫడ్నవీస్లు రావడం తప్పేంటి అని ప్రశ్నించారు.కాగా కాళేశ్వరం ప్రాజెక్టను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ప్రాజెక్టులు ఎవరు కట్టినా తెలంగాణ ప్రజల కోసమేనని అన్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే తన నియోజక వర్గంలో తాగు నీటీ కష్టాలు తీరుతాయని అన్నారు.