మన్మథుడు కి టీవి షో రూపంలో సినిమా కష్టాలు..! ఢమరుకంలా మోగుతున్న అవరోధాలు..!!
హైదరాబాద్ : టీవి షోతో మాస్ గా ముందుకెళ్దామనుకున్న మన్మథుడికి అవరోధాలు ఢమరుకంలా మారుమోగిపోతున్నాయి. బిగ్ బాస్-3 హోస్ట్ నాగార్జున కు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవబోతున్న బిగ్ బాస్ షోపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల వ్యక్తిగత వివరాలను సేకరించే క్రమంలో నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ టీవీ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఆరోపణలకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది పెద్ద ఇష్యూగా మారింది. బిగ్ బాస్ పై నీలి నీడలు అలముకున్నాయయి.
బిగ్ బాస్ -3 హోస్ట్ గా వ్యవహరించేందుకు సిద్ధమైపోయిన టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేనికి కూడా ఈ సెగ ఇప్పుడు గట్టిగానే తగిలింది. ఏకంగా ఆయన ఇంటి ముందు కొందరు విద్యార్థినులు, మహిళలు నిరసనకు దిగారు. మహిళలను కించపరిచేతి బిగ్ బాస్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఈ షోను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండు తెర పైకి వచ్చింది.
ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించవద్దంటూ నాగార్జునను డిమాండ్ చేయడం కూడా మొదలైంది. తక్షణమే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, షో నుంచి తప్పుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశారు. అటు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి గానీ ఇటు నాగ్ నుంచి తమకు స్పష్టమైన హామీ లభించని పక్షంలో నిరసనలకు కూడా దిగుతామని హెచ్చరించారు.
సాయంత్రం వరకు కూడా అటు నిర్వాహకుల నుంచిగానీ, ఇటు నాగ్ నుంచిగానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, హెచ్చరించినట్టుగానే... వర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో నాగ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ ఈ షో నుంచి తప్పుకుంటారేమోనని కొందరు ఊహాగానాలు సాగిస్తున్నారు. బిగ్ బాస్ రూపంలో మన తెలుగు మన్మథుడికి ఇలా కష్టకాలమొచ్చింది.