కొనసాగుతున్న బంద్: కోదండరాం సహా నేతల అరెస్ట్: మెట్రోలు ఫుల్..!
ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు..వామపక్షాలు..ప్రజా సంఘాలు.. విద్యార్థి సంఘాలు.. ఉద్యోగ సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. బంద్లో భాగంగా ఆందోళనలు.. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇదే సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ సహా పలు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. అనేక మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంద్ కారణంగా మెట్రో ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. అయినా..మెట్రో సర్వీసులు అన్నీ ప్రయాణీకుల తో ఫుల్ అవుతున్నాయి. బంద్ పైన అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
కొనసాగుతన్న బంద్..అడ్డుకుంటున్న పోలీసులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిర్వహిస్తున్న అఖిలపక్ష బంద్ కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో బస్సులు బయటకు రాకుండా కార్మిక సంఘాలు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ముందుగానే చేరుకున్న పోలీసులు బస్సులను అడ్డుకొనే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. అనేక చోట్ల ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా క్యాబ్..ఆటో సర్వీసులు సైతం నిలిచిపోవటంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.
సొంత వాహనాలు ఉన్న వారు మినహా మిగిలిన వారు రవాణా సౌకర్యం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పోలీసులు పహారా మధ్య బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాటిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిని కార్మిక..వామపక్ష కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బంద్ ప్రభావం పైన ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సేవలను అడ్డుకొనే వారి విషయంలో కఠినంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
కోదండరాం సహా పాలు పార్టీల నేతల అరెస్ట్..
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో సహా పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తో పాటుగా అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటిస్తున్న నేతలు అనేక మంది పోలీసుల అదుపులో ఉన్నారు. మరో వైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు కావటంతో కాంగ్రెస్.. బీజేపీ నేతలు అటు కూడా ఫోకస్ చేస్తున్నారు. బస్సు డిపోల ముందు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. దీంతో..ప్రయాణీకులు ప్రత్యామ్నామ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
గ్రేటర్ లో ఇబ్బందులు..మెట్రోలు ఫుల్..
బంద్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రయాణీకులు..ఉద్యోగులు ప్రత్యామ్నామ మార్గాలను అన్వేషిస్తున్నారు. అక్కడక్కడా బస్సులు తిరుగుతున్నా డిమాండ్ తగిన విధంగా లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. బంద్ కు మద్దతుగా గ్రేటర్లో ఆటోలు..క్యాబ్ లు నిలిచిపోయాయి. దాదాపు 20 లక్షల మంది ప్రయాణీకులు ప్రతీ రోజు ఆర్టీసీ..ఆటోలు..క్యాబ్ ల ద్వారా ప్రయాణాలు సాగించేవారు.
దీంతో..ప్రభుత్వం అదనంగా మెట్రో సర్వీసులు నడపాలని కోరింది. అయినా..మెట్రో సర్వీసులు మొత్తంగా ప్రయాణీకులతో నిండి పోయాయు. అదనపు సర్వీసులు కనిపించటం లేదని ప్రయాణీకులు వాపోతున్నారు. ఇక, సాయంత్రం ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.