తహసీల్దార్ హత్యలో కొత్త కోణాలు: ఆ భూముల పైన పెద్దల కళ్లు: వాంగ్మూలంలో ఇలా..!
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్య ఉదంతం వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వివాదాస్పద భూములు..పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవటం.. రాజకీయ ప్రముఖుల కళ్లు ఆ భూముల మీద పడటం వంటి అంశాలు రక రకాలుగా ప్రచారం సాగుతున్నాయి.
అయితే, వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోను అగ్నికి ఆహుతి చేశానని నిందితుడు సురేశ్ చెప్పాడు. సోమవారం 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పటికే దీని పైన ప్రభుత్వం సీరియస్ అవ్వటం..పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగటంతో త్వరలోనే అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక సంచలన విషయాలు.. అలా వెంటాడి.. బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Recommended Video
భూముల వివాదాలు..కొత్త కోణం
దారుణంగా పని చేస్తున్న చోటే మంటల్లో దహనం అయిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తహసీల్దార్ దారుణహత్య ఉదంతం వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. భూవివాదంపై నిందితుడు సురేష్ హైకోర్టును ఆశ్రయించాడు. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్పై వత్తిడి తెచ్చాడని.. అయితే విజయారెడ్డి తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో హత్య చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆ భూముల పైన 1990 నుంచి వివాదాలున్నట్లు చెబుతున్నారు.
2004 తర్వాత భూములపై కొందరు రాజకీయ నేతల కళ్లు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వివాదా స్పదమైన భూముల వ్యవహారంలో తల దూర్చిన కొందరు పెద్దలు.. మరోవైపు భూములు కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్లు తెలుస్తోంది.
హైకోర్టులో కోసులు ఉన్నా..
మొత్తంగా 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. కౌలుదారుల చేతిలో 77 ఎకరాలు.. పట్టాదారుల ఆధీనంలో 42 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. కాగా.. వివాదాస్పద భూముల వ్యవహారంలో ఒక రాజకీయ ప్రముఖుడితో సహా.. రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ రాజకీయ ప్రముఖులు ఎవరు..ఈ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఆ నేతలు ఎవరనేదానిపై ఆసక్తి కర చర్చ సాగుతోంది.
దీని పైన పోలీసులు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటుగా మొత్తంగా ఆ భూముల వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు.. కొద్ది రోజులుగా తహసీల్దార్ ను కలిసిన వారి వివరాలు..కోర్టులో ఉన్న కేసుల పైన పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇదే సమయంలో విజయారెడ్డి భర్త సైతం కీలక ఆరోపణలు చేసారు. దీని వెనుక పెద్దలు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా పోలీసులు పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే నిప్పు అంటిచాను..
వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోను అగ్నికి ఆహుతి చేశానని నిందితుడు సురేశ్ చెప్పాడు. సోమవారం 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంత బతిమలాడినా తనకు పట్టా ఇవ్వలేదని చెప్పాడు.
సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశానని, ఆమె స్పందించ కపోవడంతో తిరిగి పెట్రోలు డబ్బాతో కార్యాలయానికి వెళ్లానని చెప్పాడు మొదట తనపై పోసుకొని, తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్ తీవ్ర గాయాలపాలయ్యారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడే ఉన్న మరో రైతుకు కూడా కాలిన గాయాలయ్యాయి.