విద్యార్ధి, ప్రజా సంఘాల మాటున మావోయిస్ట్ కార్యాకలాపాలు: చాపకింద నీరులా మావోయిస్ట్ పార్టీ ?
తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? విద్యార్థి సంఘాల , ప్రజాసంఘాల మాటున మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతున్నాయా ? ఏజెన్సీ గ్రామాల్లో నే కాకుండా పట్టణాలు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో నూ మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారా అంటే అవును అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే సంఘాలను , మావోయిస్టు పార్టీ పట్ల కాస్త సానుభూతి వ్యక్తం చేసే సంఘాలను మావోయిస్టు అనుబంధ సంఘాలుగా పేర్కొంటూ నిషేధం విధించారు. అయితే ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని మావోయిస్టులతో తమకేమీ సంబంధం లేదని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు వాపోతున్నారు.
యూనివర్సిటీలలో విద్యార్ధి సంఘాల పేరుతో మావోయిస్టులతో సంబంధాలు
ఇక అసలు విషయానికొస్తే ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులపై పోలీసులు అరెస్టులకు పూనుకున్నారు. మావోయిస్టులతో సంబంధమున్న విద్యార్థి వేదిక అధ్యక్షుడు బండారి మద్దిలేటి తో సహా జగన్, సాయన్న లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు అయిన మద్దిలేటి , జగన్ తదితరులు మావోయిస్టులకు సహకరిస్తున్నారని వీరిపైన ఆరోపణలున్నాయి.
30 సంస్థలను నిషేధించినట్టు ప్రకటించిన సీపీ
విద్యార్థి నేతలు సందీప్, నాగరాజు, గోపి , ఖాసిం, మహేష్ రెడ్డి ,శంకర్ రెడ్డి, రమేష్ రెడ్డి ,అనుదీప్ లపై గతంలోనే కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విద్యార్థి నేతల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉందని ప్రకటించిన పోలీసులు మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్న 30 సంస్థలను నిషేధించినట్టు ప్రకటించారు. తెలంగాణ విద్యార్థి వేదిక సంస్థ మావోయిస్టు పార్టీ నుండి ఆవిర్భవించిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమారి పేర్కొన్నారు. టీవీవీ నాయకుల అరెస్టు గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ సంఘాల పేరుతో విద్యార్థులను , యువతను ఆకర్షిస్తూ మావోయిజం వైపు మళ్ళిస్తున్నారని సిపి ఆరోపించారు.
టీవీవీ నేతలపై బెదిరింపు ఆరోపణలు
గత కొంతకాలంగా తెలంగాణా విద్యార్ధి వేదిక నాయకుడు జగన్ మావోయిస్టులకు టచ్లో ఉన్నారని, మావోయిస్టులకు ఫండ్ ఇవ్వాలని కార్పొరేట్ కంపెనీలు బెదిరిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇక జగన్, మద్దిలేటి ఇళ్లల్లో మావోయిస్టు అగ్ర నేత హరికిషన్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగన్, మద్దిలేటిపై పుణె, కర్నాటకలో కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక అంతే కాదు టీవీవీ నేతలకు దంతేవాడ, బీజాపూర్లలో ఉన్న మావోయిస్టులో సంబంధాలున్నాయనే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు.
నిషేధిత సంఘాలను ప్రకటించిన సీపీ అంజనీ కుమార్
మావోయిస్టు పార్టీకి సంబంధం ఉన్నట్లుగా 30 సంస్థలను గుర్తించామని వాటిని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిషేధించిన సంస్థలలో ఆదివాసీ విద్యార్థి సంఘం, చైతన్య మహిళా సంఘం, సివిల్ లిబర్టీ కమిటీ,హ్యూమన్ రైట్స్ ఫోరం, కుల నిర్మూలన పోరాట సమితి, పాట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ప్రజాకళా మండలి, కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి సంఘాలతో పాటు పాత సంఘాలు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్లను రాష్ట్రంలో నిషేధించారని సీపీ వివరించారు.
నిషేధం విధించటంపై మండిపడుతున్న ప్రజా, విద్యార్థి సంఘాలు
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా నిషేధానికి పాల్పడుతోందని సంబంధిత ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. తమకు మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చి చెబుతున్నారు. ఈ సంస్థలపై నిషేధం విధించలేదని మానవ హక్కుల వేదిక రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్ కుమార్ పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా ప్రజా పోరాటాలు చేస్తున్న మాకు మావోయిస్టులతో లింకేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు .
సీఎం కేసీఆర్ కుట్ర అని ప్రజా సంఘాల ఆరోపణ
ప్రజాసంఘాల నేతలు సిపి అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ నేత మాట్లాడినట్టు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు గత 50 ఏళ్లుగా ప్రజలతో మమేకమై కళాకారులుగా, రచయితలుగా, పోరాట యోధులుగా, హక్కుల కార్యకర్తలుగా , ఉద్యమ సారధులుగా ఉన్నామని అలాంటి మా పై నిషేధం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక అంతే కాదు ప్రశ్నించే వారి గొంతు అణిచివేయడం కోసం సీఎం కేసీఆర్ కుట్రకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే మావోయిస్టుల పేరుతో భయపెడుతున్నారని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.
చాప కింద నీరులా మావోయిస్ట్ పార్టీ
విద్యార్థి సంఘాలను , ప్రజా సంఘాలను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు గా పేర్కొనడం సమంజసం కాదని వారంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం మావోయిస్టు పార్టీ చాపకింద నీరులా పలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల పేరుతో విస్తరిస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న మావోయిస్టు పార్టీ ఇంకా కార్యకలాపాలు సాగిస్తున్నదనే విషయాన్ని ఏకంగా పోలీస్ కమిషనర్ వివరించడం గమనార్హం.