మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు కట్టుకథేనా?: మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుపోతున్నారంటూ గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో కీలక నేత కూడా పోలీసుల ముందు లొంగిపోతున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది.
గణపతి లొంగుబాటు కల్పిత కథ..
గణపతి లొంగుబాటు అనేది పోలీసుల కల్పిత కథ అని మావోయిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన రెండు పేజీల లేఖ ఈ మేరకు స్పష్టం చేసింది. గణపతి లొంగుబాటు అనేది ఒక హైటెన్షన్ కల్పిత కథ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమన్నారు.
స్వచ్ఛందంగా తప్పుకున్నారు కానీ..
తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ అధికారులు కట్టు కథలు అల్లారని, పోలీసులు అల్లిన నాటకంలో మీడియాను పావులుగా వాడుకున్నారని వ్యాఖ్యానించారు. కామ్రేడ్ గణపతి అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారని, అయినా ప్రజా సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీ దృఢంగా ఉంది..
గణపతితోపాటు మరి కొంతమంది మావోయిస్టుల లొంగుబాటుపై వస్తున్న వార్తలను లేఖలో ఖండించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇంటెలీజెన్స్ పోలీసులు అల్లిన కట్టుకథను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా తమ నాయకత్వం దృఢంగా ఉందని స్పష్టం చేశారు.
Recommended Video
మావోయిస్టుల ప్రతిష్ట దెబ్బతీసేందుకే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నామని, తమ నాయకత్వపు ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని అన్నారు. ఈ కట్టుకథలను మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వాల దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడలని పిలుపునిస్తున్నామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని లేఖలో పేర్కొన్నారు. కాగా, జగిత్యాలకు చెందిన 73ఏళ్ల గణపతి 40ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ అగ్రనేతగా ఎదిగిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి పోలీసుల ముందు లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.