కార్పోరేట్కు కొమ్ముకాస్తున్న కేసీఆర్.. ప్రజలు ఉద్యమించాలి: మావోయిస్టు లేఖ
కేంద్రం తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మావోయిస్టు కమిటీ మండిపడింది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని మావోయిస్టు కమిటీ నిరసిస్తోంది. అరచేతిలో బంగారు తెలంగాణను చూపిస్తూ.. కార్పోరేట్ కంపెనీలకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని మావోయిస్టు కమిటీ తీవ్ర విమర్శలు చేసింది.
భూసేకరణ పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. పేదల నుంచి బలవంతంగా భూములను తీసుకుని వాటిని కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే 2016 భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చారని కేసీఆర్ పై మావోయిస్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మీడియాకు మావోయిస్టు కమిటీ ఓ లేఖను విడుదల చేసింది.
పేద వర్గాలకు భూమి లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వంపై ప్రజలంతా పోరాటం చేయాలని లేఖలో మావోయిస్టు కమిటీ పిలుపునిచ్చింది. అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచీని పరుస్తున్నారని కమిటీ ఆరోపించింది.
ఏపీ ప్రభుత్వ వైఖరి కూడా మావోయిస్టు పార్టీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మండిపడింది. కొత్త భూసేకరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా లేఖలో కమిటీ పేర్కొంది. కొత్త చట్టాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాల్సిందిగా మావోయిస్టు కమిటీ డిమాండ్ వేసింది.