ఇన్నాళ్లకు గుర్తొచ్చానా బిడ్డా: 40ఏళ్ల తర్వాత తల్లిని చూసి జంపన్న కంటతడి, భావోద్వేగ సంభాషణ
Recommended Video
వరంగల్: 33ఏళ్ల అజ్ఞాతవాసం అనంతరం మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన జంపన్న.. సోమవారం తన కన్నతల్లిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య భావోద్వేగ వాతావరణం నెలకొంది.
మావోలు మారడం లేదు, బాధాకరమే, ద్రోహం కాదు: జంపన్న కీలక వ్యాఖ్యలు
దశబ్దాల తర్వాత తన వద్దకు వచ్చిన జంపన్నతో.. ఇన్నాళ్లూ గుర్తుకు రాలేదా బిడ్డా అంటూ ఆయన తల్లి యశోద కన్నీటిపర్యాంతమైంది. తన తల్లిని చూసిన ఆనందంలో భావోద్వేగానికి గురైన జంపన్న కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
నిన్ను చూసేందుకే బతికున్నా..
‘ఇన్నాళ్లు నిన్ను చూడడానికి బతికి ఉండాలని అనుకున్న. ఇప్పుడు నిన్ను చూసిన.. ఇక చనిపోయినా బాధ లేదు బిడ్డా' అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న తల్లి యశోద కన్నీరు పెట్టుకున్నారు. జంపన్న సోమవారం హైదరాబాద్లో డీజీపీ సమక్షంలో లొంగియిని విషయం తెలిసిందే. అనంతరం కాజీపేట ప్రశాంత్నగర్లోని సహృదయ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తన తల్లిని కలుసుకున్నారు.
ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు
దాదాపు 40ఏళ్లపాటు దూరంగా ఉన్న తల్లీకొడుకుల మధ్య ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలో జంపన్న కూడా భావోద్వేగంతో తల్లితోపాటు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తల్లీకొడుకుల మధ్య భావోద్వేగ సంభాషణ
ఇన్నాళ్లు తాను గుర్తుకు రాలేదా? బిడ్డా అని తల్లి యశోదా ప్రశ్నించగా.. ‘కన్న తల్లి ఎప్పుడూ కళ్లలోనే ఉంటుందమ్మా.. నేను నీకు ఎంత దూరంగా ఉన్నానో నా మనసు నీకు అంత దగ్గరగా ఉంది. పార్టీలో ఉన్నప్పుడు ఇవన్ని బయటికి కన్పించకూడదు. నాలో నేను దాచుకున్నాను. క్షమించు తల్లి' అంటూ జంపన్న భావోద్వేగానికి గురయ్యారు.
నన్ను వదిలి పోతావా?
నన్ను వదిలిపెట్టి మళ్లీ పోతవా? అని తల్లి అడగ్గా.. ‘మళ్లీ నేను పోను.. ఇక నీతోనే ఉంటా.. ప్రజలతో ఉంటా. ప్రజల బాగోగుల కోసమే నేను అడవిలోకి వెళ్లిన. అక్కడ ఉండే కాదు.. ఇక్కడ ఉండీ వారి బాగోగులు చూసుకోవచ్చని అనుకున్న. మళ్లీ ఎక్కడకు పోను' అని జంపన్న తెలిపారు. ‘అందరూ ఎలా బతుకుతున్నారో నేను అలాగే బతుకుతా. మనకు భూములు లేవు. ఆస్తులు లేవు.. ఆశ్రమంలో ఉన్న వారంతా ఎలా బతుకుతున్నారో వారి లాగే నేనూ ఎట్లాగో బతుకుతా. నీ ప్రేమకు దూరమయ్యాను' అని తల్లి అడిగిన ఓ ప్రశ్నకు జంపన్న సమాధానంగా చెప్పుకొచ్చారు.
అడవిలో ఎట్లా వున్నావు బిడ్డా..?
అడవిలో ఎట్లావున్నావు బిడ్డా అని తల్లి యశోదా ప్రశ్నించగా.. ‘అడవిలో ఆకలి కోసం ఆలోచించే వాళ్లం కాదు. అక్కడ అందరమూ దొరికినప్పుడు అన్నం తినే వాళ్లం' అని జంపన్న తెలిపారు. ‘నీకు తెలివి ఎక్కువ.. అందుకే ఇంత పేరు తెచ్చుకున్నావు' అని తల్లి వ్యాఖ్యానించగా.. ‘నాకంటే తెలివి కలిగిన వాళ్లున్నారు. వాళ్ల తెలివి ముందు నాది ఎంత?. నేను చదివింది పదో తరగతి, ఐటీఐ మాత్రమే.. నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. పార్టీలోకి వెళ్లాను. పార్టీ నాకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే నాయకుడిని అయ్యాను. అందరి మనసుల్లో ఉన్నాను ' అని జంపన్న వివరించారు.
పోలీసులు ఏమైనా అంటారా?, పార్టీ వాళ్లు ఊరుకుంటారా?
తల్లి ప్రశ్నలకు జంపన్న జవాబిస్తూ... ‘పోలీసుల వద్దకే వచ్చిన. ఇక నన్ను వారు ఏమంటరు. ఎవరూ ఏమీ అనరు. ఇక మావోయిస్టు పార్టీ అనుమతితోనే నేను బయటికి వచ్చిన .ఇక వారు కూడా నన్ను ఏమీ అనరు. లోపల చేసే సేవే ఇక్కడ చేస్తాను. పార్టీ పెట్టి.. నాయకుడిని కావాలనే ఆలోచన లేదు.
తల్లి, తన భార్య గురించి జంపన్న
‘నా భార్య ధైర్య వంతురాలు.. ఆమెకు ఇంతకాలం దూరంగా ఉన్నా ఆమెకు నా మీద కోపం రాలేదు. మంచి తల్లి.. మంచి భార్య దొరికినందుకు సంతోషంగా ఉంది' అని జంపన్న చెప్పారు. ఆకలి అయితాందా బిడ్డా.. అన్నం తింటవా? అంటూ తల్లి అనడంతో.. ‘ఆకలి అవుతుందమ్మా.. నీకు రెండు ముద్దలు తినిపించి నేను తింటాను' అంటూ జంపన్న తల్లికి అన్నం తినిపించి, ఆయన కూడా తిన్నారు. తాను ఎప్పుడూ తన తల్లిని కలుస్తానో లేదో అని ఆందోళనతో ఉండేవాడినని, ఇప్పుడు తనకు సంతోషంగా ఉందని జంపన్న తెలిపారు. ఈ సందర్భంగా జంపన్న భార్య రజిత మాట్లాడుతూ.. తాము తిరిగి వస్తామని అనుకోలేదని చెప్పారు. అవకాశం రాబట్టే జంటగా జనజీవనంలోకి వచ్చామని చెప్పారు. జంపన్నకు తన తల్లి ఎక్కడుందనేది ఈ మధ్య కాలంలోనే తెలిసిందని తెలిపారు. తాము లగ్జరీగా జీవించేందుకు పార్టీ నుంచి బయటకు రాలేదని, సాధారణ జీవనం సాగించేందుకే వచ్చామని రజిత వివరించారు.