శృతిని అత్యాచారం చేసి చంపేశారు, గాయాలిదిగో!: తల్లిదండ్రుల రోదన
వరంగల్: వరంగల్ ఎన్కౌంటర్లో పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శృతిని అత్యాచారం చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. బుధవారం నాడు మృతదేహాన్ని చూసిన తర్వాత తల్లిదండ్రులు సుదర్శన్, రమాదేవి ఆవేశంగా బయటకు వచ్చారు.
వరవరరావుతో పరిస్థితిని చెప్పారు. అనంతరం శృతి తల్లి మాట్లాడారు. శృతి ఒంటిపై బాగా గాయాలున్నాయని, దారుణంగా కాల్చి చంపారని ఆరోపించారు. చిత్రహింసలకు గురి చేశారన్నారు.
కడుపు మీద యాసిడ్ పోయడంతో పేగులు, మాంసపు ముద్దలు బయటకు కనిపిస్తున్నాయని, శృతిని కడుపు వరకే చూపించారని, మిగతా భాగం నువ్వు చూడలేవమ్మా అని డాక్టర్లు చెప్పారని, తన బిడ్డ పైన అత్యాచారం చేశారని, చేతికి కూడా గాయాలయ్యాయని రోదిస్తూ చెప్పారు.
తల్లిదండ్రుల సమక్షంలోనే శవపరీక్ష జరిపేందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో బాధితులు బుధవారం నాడు మానవ హక్కుల కమిషన్, మొదటి అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తల్లిదండ్రుల ముందే శవపరీక్ష చేయడంతో పాటు దానిని వీడియో తీయించాలని, పోస్టుమార్టం చేసేముందు ఫోటోలు తీయించాలని ఆ పిటిషన్లో కోరారు.
వారికి అనుకూలంగా పోలీసులకు కోర్టు నుంచి ఆదేశాలు అందాయి. శవపరీక్ష తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు రెండు మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. శృతి మృతదేహాన్ని సాయంత్రం వరంగల్లోని స్వగృహానికి తీసుకు వచ్చారు.
పరామర్శించేందుకు వరంగల్ జిల్లా టిఆర్ఎస్ ఇంఛార్జ్ పెద్ది సుదర్సన్ రెడ్డి వచ్చారు. ఆయనను శృతి బంధువులు అడ్డుకున్నారు. గో బ్యాంక్ అంటూ టిఆర్ఎస్, కెసిఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సుదర్శన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.