మావోయిస్టుల చెర నుంచి ఆరుగురు టిఆర్ఎస్ నాయకుల విడుదల
ఖమ్మం: నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీప్రాంతంలో అపహరించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు విడుదల చేశారు. వీరిని ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిసింది.
గ్రీన్ హంట్ను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ.. భద్రాచలం టిఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ మానె రామకృష్ణ, పూసుగుప్ప మాజీ సర్పంచ్ ఉయికా రామకృష్ణ, టిఆర్ఎస్ చర్ల మండల మాజీ అధ్యక్షుడు పటేల్ వెంకటేశ్వరరావు, మాజీ కార్యదర్శి సంతపూరి సురేశ్, వాజేడు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు దబ్బకట్ల జనార్దన్, వెంకటాపురం టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి డెక్కా సత్యనారాయణలను బుధవారం చర్ల మండలం పూసుగుప్ప వద్ద మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
విడుదలైన ఆరుగురు టిఆర్ఎస్ నాయకులు శనివారం ఉదయం చర్ల చేరుకున్నారు. టిఆర్ఎస్ నాయకులను మావోయిస్టులు క్షేమంగా వదిలిపెట్టడంతో వారి వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, గ్రీన్ హంట్ను, బూటకపు ఎన్కౌంటర్లను నిలిపేయాలని చెప్పి తమను విడిచి పెట్టారని అపహరణకు గురైన టిఆర్ఎస్ నాయకులు తెలిపారు.