కూంబింగ్ ఆపేయండి .. లేదంటే టీఆర్ఎస్ నేతకు పట్టినగతే పడుతుంది ..మావోల వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కూంబింగ్ ఆపకుంటే ములుగు లో టీఆర్ఎస్ నేత కు పట్టిన గతే మిగతా టిఆర్ఎస్, బిజెపి నాయకులకు పడుతుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ములుగు జిల్లా లోని ఏటూరునాగారం మండలం షాపల్లి గ్రామం లో వాల్ పోస్టర్లు వేసిన మావోయిస్టులు తెలంగాణ సీఎం కేసీఆర్ పై సైతం విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి .
మావోల ఘాతుకంతో ప్రజా ప్రతినిధులకు పోలీస్ అలెర్ట్ .. రాజకీయ వర్గాలకు టెన్షన్
మావోలకు చెక్ పెట్టేందుకు పోలీసుల కూంబింగ్ ... ఆపాలంటూ పోస్టర్లు.. మావోల వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు చత్తీస్ గడ్ , తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపాలంటూ మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్లు వేయడం ములుగు జిల్లాలో కలకలం సృష్టించింది. కూంబింగ్ ఆపకపోతే టిఆర్ఎస్ నేత భీమేశ్వరరావుకి పట్టిన గతే ఇతర టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు పడుతుందని ఆ వాల్ పోస్టర్ లో హెచ్చరికలు జారీ చేసింది మావోయిస్టు పార్టీ. కేంద్రం ఆపరేషన్ ప్రహార్ ద్వారా మావోయిస్టుల ఏరివేతకు దిగటం , అలాగే తెలంగాణా ప్రభుత్వం కూడా సరిహద్దు అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టటంతో మావోలు ఈ హెచ్చరికలు జారీ చేశారు .
పోలీస్ ఇన్ ఫార్మర్ లకు, ఫారెస్ట్ అధికారులకు సీరియస్ హెచ్చరిక ..
పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న వారికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మావోయిస్ట్ లు . మాజీ మావోయిస్టు ముద్ర బోయిన సంపత్ పోలీసులను తన బొలెరో వాహనంలో తిప్పుతూ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పడంపై సంపత్ తీరును తీవ్రంగా ఆక్షేపించింది మావోయిస్టు పార్టీ. తీరు మార్చుకోకపోతే ప్రజా కోర్టులో ప్రజల చేతిలో శిక్ష తప్పదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఫారెస్ట్ అధికారులపై కూడా విరుచుకుపడిన మావోయిస్టు పార్టీ , అధికారులు డిఆర్వో ప్రహ్లాద్, సందీప్, రవీందర్ లు తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు .
కేసీఆర్ రెవెన్యూ చట్టం తో చేసేదేమీ లేదు .. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై మావోలు ఫైర్
కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన మావోయిస్టులు కొత్త రెవెన్యూ చట్టం తో చేసేదేమీ లేదని, ప్రజల సమస్యలను పరిష్కరించమని అడిగితే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని కెసిఆర్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పెంచుతూ ప్రజల పై అక్రమ కేసులు పెడుతున్నారని అమ్మ తల్లి కెసిఆర్ పై మావోయిస్టులు ఫైర్ అవుతున్నారు. ఒకపక్క మావోయిస్టుల అణచివేతకు కోసం పోలీసులు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేస్తుంటే మావోలు ప్రతిగా యాక్టివిటీస్ చేస్తున్నారు.
Recommended Video
చర్యలకు ప్రతి చర్యలుంటాయని వార్నింగ్ ..పోలీసులకు సవాల్ విసురుతున్న మావోలు
మావోయిస్టులు గ్రామాలలో పోస్టర్లు వేయడం, ఏకంగా ఇళ్లకు వచ్చి దాడులకు పాల్పడడం, తాజాగా ములుగులో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు ను హతమార్చడం వంటి సంఘటనలు పోలీసు వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయి . పోలీసులు తమ చర్యలను ఆపకపోతే, కచ్చితంగా ప్రతి చర్యలు ఉంటాయని మావోయిస్టులు హెచ్చరించడం తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి అన్నసంకేతాలను ఇస్తున్నాయి.