కిడారి హత్య తరహాలోనే.. : తెలంగాణలో మావోలు టార్గెట్ చేసిన ఆ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరు..?
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అదే సమయంలో మావోయిస్టుల కదలికలు కూడా అధికార యంత్రాంగానికి చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు హెచ్చరించారు. అయితే ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలోనే మావోలు విడుదల చేసిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో తెలంగాణలోని ఎమ్మెల్యేలకు కూడా అదే గతి పడుతుందనే లేఖ నేతల్లో భయాందోళన కలిగిస్తోంది. మావోల నుంచి ప్రమాదం ఎటునుంచి పొంచి ఉందోనన్న భయం ప్రచారానికి వెళుతున్న నాయకుల్లో కనిపిస్తోంది.
దుర్గం చిన్నయ్యను ఎందుకు టార్గెట్ చేశారు..?
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను కొద్ది రోజుల క్రితం మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలోని తాజా మాజీ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు మావోయిస్టులు. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామా చేయడంతో కొత్త నాయకత్వం ఏర్పడింది. వారి ఉనికిని చాటుకునేందుకు ఈ నాయకత్వం తెలంగాణలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టార్గెట్ చేశారు. సింగరేణి కార్మిక సంఘం నుంచి దుర్గం చిన్నయ్యకు బెదిరింపు లేఖ వచ్చింది.
దొరలకు తొత్తుగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటావు
దుర్గం చిన్నయ్యకు మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖ కామ్రేడ్ చార్లెస్ పేరుతో వచ్చింది. దళితుడిగా చెప్పుకుంటూ దొరలకు తొత్తుగా వ్యవహరించడం సరికాదని లేఖలో ఉంది. దళితుడిగా చెప్పుకుంటూ సామ్రాజ్యవాద పెత్తనం చేస్తే మావోయిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని లేఖలో ఉంది. దళిత భూములు, ఆక్రమిత భూములు, కబ్జాల భూములు, వెంటనే పేదలకు పంచిపెట్టాలని లేదంటే ఏపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోముల గతే తనకు కూడా పడుతుందంటూ దుర్గం చిన్నయ్యను మావోలో లేఖ ద్వారా హెచ్చరించారు. బుద్ధిగా మెలగాలని సూచిస్తూనే... కాదు కూడదంటే చంద్రబాబు, మాధవరెడ్డిలపై ఎలా అయితే అటాక్ చేశామో అదే తరహాలో తనపై కూడా గురిపెట్టాల్సి వస్తుందని దుర్గం చిన్నయ్యను మావోలు హెచ్చరించారు. ఇదిలా ఉంటే సింగరేణి కోల్ బెల్ట్ సంఘం లేఖలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మావోల లేఖతో అప్రమత్తమైన పోలీస్ శాఖ
ఎన్నికల వేళ మావోయిస్టుల లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. వారం రోజుల క్రితం ఛత్తీస్గడ్లోని దంతెవాడ జిల్లాలో బస్తర్ ప్రాంతంలో దాడి చేసి నక్సల్స్ తమ ఉనికిని చాటుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు దూరదర్శన్ కెమెరామెన్ మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు తెలంగాణలో కూడా తలెత్తే అవకాశం ఉండటంతో భద్రతాసిబ్బంది అలర్ట్ అయ్యారు.