పుట్టామధు అక్రమాలపై మావోల కరపత్రాలు .. ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వార్నింగ్
పెద్దపల్లి జడ్పీ చైర్మన్, అధికార పార్టీ నేత పుట్టమధు కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు, కాటారం మాజీ ఏఎంసీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్ రావుకు ప్రజల సమక్షంలో శిక్ష తప్పదని మావోయిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో పుట్ట మధు అవినీతికి పాల్పడ్డాడని, పలు అక్రమాలు చేశారని రైతులను మోసం చేశారని పేర్కొన్న మావోయిస్టులు రైతుల నుంచి దండుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని కరపత్రాలను విడుదల చేశారు.
సీపీఐ మావోయిస్టు మహదేవపూర్-ఏటూరు నాగారం ఏరియా కమిటీ పేరిట ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలలో కరపత్రాలు లభ్యమయ్యాయి. మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు భూసేకరణలో రైతులకు అందాల్సిన కోట్లాది రూపాయల నష్ట పరిహారాన్ని పుట్ట మధు, కాటారం మాజీ ఏఎంసీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్ రావులు నిర్మాణ సంస్థతో కలిసి దండుకున్నారని ఆరోపించారు. భూసేకరణకు సహకరించని రైతులను అప్పటి కాటారం డీఎస్పీ ప్రసాదరావుతో కలిసి భయభ్రాంతులకు గురి చేశారని మావోయిస్టులు ఆ కరపత్రాలు పేర్కొన్నారు .
ఇప్పటికైనా పుట్ట మధు, లింగంపల్లి శ్రీనివాసరావులు తీరు మార్చుకుని రైతుల నుంచి దండుకున్న సొమ్మును, తిరిగి వారికి చెల్లించాలని వారు పేర్కొన్నారు. లేనిపక్షంలో ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మావోయిస్టులు . ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలలో కరపత్రాలను మావోలు విడుదల చేశారు. అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరపత్రాల నేపధ్యంలో అలెర్ట్ అయిన పోలీసులు పుట్టా మధు భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలోనూ మావోయిస్టులు అధికార పార్టీ నేతలకు, సీఎం కేసీఆర్ కు కూడా పలు మార్లు హెచ్చరికలు జారీ చేశారు.