ఒక్కడి పనేనా.. కుట్ర కోణం ఉందా... గొర్రెకుంట హత్యలపై బంధువుల అనుమానాలు..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో వెలుగుచూసిన 9 హత్యల మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. మక్సూద్ కుటుంబానికి సన్నిహితుడైన సంజయ్ కుమార్ అనే బీహారీ యువకుడే ఈ హత్యలకు పాల్పడ్డట్టుగా నిర్దారించారు. అయితే మక్సూద్ బంధువులు మాత్రం దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం ఉదయం కోల్కతా నుంచి వరంగల్ చేరకున్న మక్సూద్ అలం భార్య నిషా బంధువులు.. ఎంజీఎం మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై మాట్లాడుతూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక్కడే 9 మందిని ఎలా హత్య చేయగలడని వారు ప్రశ్నించారు. ఇంతమంది హత్యకు గురికావడం వెనుక మరేదైనా కుట్ర కోణం ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలను వెలికి తీయాలన్నారు.
మరోవైపు పోలీసుల విచారణలో సంజయ్ కుమార్ నేరం అంగీకరించాడు. నిషా ఆలం సోదరి కూతురి రఫీకాతో సహజీవనం చేసిన సంజయ్.. ఆమెను వదిలించుకోవడానికి హత్య చేశాడు. పెళ్లి చేసుకుంటానని,బెంగాల్లోని తనవాళ్లకు పరిచయం చేస్తానని గరీబ్రథ్ రైల్లో తనతో పాటు తీసుకెళ్లి చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం రైలు నుంచి బయటకు తోసేశాడు.
తనతో సహజీవనం చేస్తూనే తన కుమార్తెతో చనువుగా మెలగడంపై రఫీకా సంజయ్ని మందలించింది. పద్దతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించింది. దీంతో సంజయ్ ఆమె అడ్డు తొలగించడానికి రైల్లో తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్టు తిరిగి వరంగల్ చేరుకున్నాడు. అయితే నిషా ఆలం పదేపదే రఫీకా ఆచూకీ గురించి అడగడం మొదలుపెట్టింది. సంజయ్ బుకాయిస్తూ రావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.
రఫీకా హత్య ఎక్కడ బయటపడుతుందోమోనని సంజయ్ మక్సూద్ కుటుంబం మొత్తాన్ని హతమార్చాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మక్సూద్ కుటుంబంతో పాటు పొరుగునే ఉన్న ఇద్దరు బీహారీ యువకులను,డ్రైవర్ షకీల్ను కూడా హత్య చేశాడు. బుష్రా కుమారుడి బర్త్ డే పార్టీలో ఆహారంలో నిద్రమాత్రలు కలిపి.. అందరూ అపస్మారక స్థితిలోకి జారుకున్నాక ఒక్కొక్కరిని గోనె సంచుల్లో చుట్టి బావిలో పడేశాడు. ఆ మరుసటి రోజు 4 మృతదేహాలు,మరో రోజు 5 మృతదేహాలు వెలుగుచూడటంతో ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.