సిమెంట్ ఇటుకల లారీలో గంజాయి అక్రమ రవాణా ... ఒక కోటి డెబ్బై లక్షల గంజాయి పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ మధ్య అంబులెన్స్ లో బొగ్గు లారీలో గంజాయి రవాణా జరిగితే ఇక తాజాగా సిమెంట్ ఇటుకల లారీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న తీరు చూసి డీఆర్ఐ అధికారులే షాక్ తిన్నారు.
రోజుకో కొత్త ప్లాన్ తో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు
గంజాయి.. మానవాళి మనుగడకు విఘాతం కలిగించే మాదకద్రవ్యాల మహమ్మారి .అటువంటి గంజాయి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పటిష్టమైన నిఘా ఉన్నా విచ్చలవిడిగా జరుగుతుంది. స్మగ్లర్లు ఎవరికీ దొరకకుండా రోజుకో మార్గాన్ని గంజాయి తరలింపుకు ఉపయోగించుకుంటున్నారు. పక్కా సమాచారం ఉంటే తప్ప గంజాయిని పట్టుకోలేని పరిస్థితి .
కోటి డెబ్బై లక్షల విలువైన గంజాయి పట్టుకున్న డీఆర్ ఐ అధికారులు
ఇక తాజాగా పక్కా సమాచారంతో... హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు... ఓ టాటా ట్రక్కును అడ్డుకొని తనిఖీలు చేశారు. నల్గొండ జిల్లాలో విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై పంతంగి టోల్గేట్ దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 546 మూటల గంజాయి దొరికింది. దీని విలువ రూ.1,68,22,500 ఉంటుందని అంచనా వేశారు.మొత్తం 1,121.5 కేజీల గంజాయిని స్వాధీనం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సిమెంట్ ఇటుకల ట్రక్ లో గంజాయి స్మగ్లింగ్ ...
సిమెంట్ ఇటుకల మధ్యలో క్రింద భాగంలో గంజాయి బ్యాగ్లు ఉంచి వాటిపైన సిమెంట్ బ్రిక్స్ వేసి మరీ రవాణా చేస్తున్నారు. గంజాయిని టేపులతో మూటలు కట్టిన గంజాయిని పట్టుకున్న అధికారులు విశాఖ జిల్లాలో ఒడిశా సరిహద్దున ఉన్న సీలేరు ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు దీన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. గంజాయితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.