ఇదీ కేసీఆర్! లేదు.. నేను అలా అన్లేదని కోర్టులోనే మాట మార్చారు: మర్రి
హైదరాబాద్: సాక్షాత్తు హైకోర్టులోనే కెసిఆర్ ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట మార్చారని, మొదట గురువారం ఉదయం రేపటిలోగా రిజర్వేషన్లు ఖరారవుతాయని చెప్పి, ఆ తర్వాత తాను అలా అనలేదని, ప్రయత్నిస్తామని చెప్పానని వ్యాఖ్యానించారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కుదింపు పైన గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కుదింపుకు సంబంధించిన జీవో పైన హైకోర్టు స్టే విధించింది. అనంతరం మర్రి శశిధర్ రెడ్డి, న్యాయవాది విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు.
ఏజీ (అడ్వోకేట్ జనరల్) ఉదయం విచారణ సందర్భంగా మాట్లాడుతూ... నోటిఫికేషన్ రేపు వస్తుందని చెప్పారని, మధ్యాహ్నం హైకోర్టు కుదింపు జీవో పైన స్టే విధించారని, ఆ సమయంలో ఏజీ రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ అన్నారని చెప్పారు.
ఏజీ తీరును హైకోర్టు కూడా ప్రశ్నించిందన్నారు. ఉదయం రేపు అని చెప్పారని, ఇప్పుడేమో రెండు మూడు రోజులు అంటున్నారని అడగ్గా.. తాను అలా అనలేదని ఏజీ చెప్పారని, కోర్టు సాక్షిగా కెసిఆర్ తీరు అర్థమవుతోందన్నారు.
తెరాస ప్రభుత్వం తీరు ప్రాజస్వామ్య విలువలను కాలరాసేలా ఉందన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో తాము కోరిన 40 రోజుల గడువు వస్తోందన్నారు. ఇది శుభపరిణామం అన్నారు.