శశిధర్ రెడ్డి సంచలనం - రేవంత్ ఏజెంట్ గా ఠాగూర్ : కల్లోలానికి కారణం ఆయనే..!!
తెలంగాణ కాంగ్రెస్ లో టార్గెట్ రేవంత్ రాజకీయం వేడెక్కుతోంది. మునుగోడు ఉప ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..సీనియర్లు ఒక్కక్కరిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ పైన మండిపడుతున్నారు. ఇప్పటి వరకు పార్టీ నుంచి వలసలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంతో కాంగ్రెస్ లో రాజకీయం కొనసాగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ క్షమాపణతో పరిస్థితి కామ్ అయింది. ఇప్పుడు, పార్టీ సీనియర్ నేత మరి శశిధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ తీరును తప్పు బట్టారు. సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉన్నారు. అటు మునుగోడు పైన కాంగ్రెస్ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంద. టీపీసీసీ చీఫ్ రేవంత్ సమర్ధతకు పరీక్ష్గగా నిలుస్తోంది. ఈ సమయంలో సీనియర్లు కీలక వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను నడిపిస్తున్న వారే పార్టీలో కల్లోలానికి కారణమంటూ రేవంత్ పైన పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగా జరిగిందన్నారు. అదే సమయంలో ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. రేవంత్కు ఏజెంట్గా పని చేస్తున్నారంటూ విమర్శించారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను అగౌరవపరిచినా రేవంత్ను అధిష్టానం ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. సీనియర్లను గోడకేసి కొడతానని అన్నా పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అటు మునుగోడు సమావేశానికి కాంగ్రెస్ నేత మధు యాష్కీ గైర్హాజరయ్యారు. దీని పైన పార్టీ వ్యవహారా ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నెల 22 నుంచి మునుగోడులో పర్యటించేందుకు రేవంత్ సిద్దం అవుతున్నారు. ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుదనేది ఆసక్తి కరంగా మారుతోంది.