కొడుకు కోసం: శ్రీరామనవమి రోజున ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి
బలవన్మరణానికి పాల్పడిన ఓ ప్రేమజంట విగ్రహాలకు ప్రతీ శ్రీరామనవమి రోజున వివాహం జరిపిస్తున్న ఘటన బయ్యారం మండలంలోని సంతులాల్పోడు తండాలో జరుగుతోంది.
మహబూబాబాద్: బలవన్మరణానికి పాల్పడిన ఓ ప్రేమజంట విగ్రహాలకు ప్రతీ శ్రీరామనవమి రోజున వివాహం జరిపిస్తున్న ఘటన బయ్యారం మండలంలోని సంతులాల్పోడు తండాలో జరుగుతోంది. స్థానికులు, కటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతులాల్పోడు తండాలకు చెందిన బానోత్ సుక్కమ్మ-లాల్కుల కుమారుడు రాంకోఠి అదే తండాలోని ఓ యువతిని ప్రేమించాడు.
ఆ ప్రేమ వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో రాంకోఠి 2004లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో మరో ఏడాది ఆ యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిరోజుల తర్వాత రాంకోఠి తల్లి సుక్కమ్మ కలలోకి వచ్చి 'నేను ఎక్కడికి పోలేదు. మీ వద్దనే ఉన్నాను. నాకు గుడి క్టించి ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించు' అని చెప్పినట్లు తెలిపారు.
కొడుకు కోరిక తీర్చేందుకు తల్లి సుక్కమ్మ 2006లో గ్రామంలో గుడి కట్టించి అందులో కొడుకు రాంకోఠితో పాటు అతడు ప్రేమించిన అమ్మాయి రూపాంతం కలిగిన విగ్రహాలను ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూ 2007 శ్రీరామ నవమి నుంచి ప్రతీ ఏడాది ఆ విగ్రహాలకు వివాహం జరిపిస్తూ వస్తున్నారు. వివాహ తదుపరి గ్రామ పెద్దలకు అన్నదానం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం శ్రీరామ నవమి రోజున కూడా ఆ ప్రేమికుల విగ్రహాలకు వివాహం జరిపించారు.