మేమిద్దరం ఫ్రెండ్స్.. మీ అమ్మతో చాలాకాలంగా స్నేహం.. ఆ కిలేడీ అస్త్రం ఇదే..
ఆమె కూలీ పనులు చేసుకునే ఓ సాధారణ మహిళ. కానీ కూలీ డబ్బులతో కుటుంబం గడవడమే కష్టమైపోయేది. చిన్న చిన్న సరదాలకూ డబ్బులు ఉండేవి కావు. దీంతో ఈజీ మనీ కోసం చోరీలకు అలవాటుపడింది. చోరీ చేయాలనుకునే ముందుగా రెక్కీ చేస్తుంది. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేరని తెలిస్తే.. నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయి పిల్లలతో మాటలు కలుపుతుంది. తాను మీ అమ్మ స్నేహితురాలిని అని నమ్మబలుకుతుంది. కాసేపటికి బంగారం,నగదు చోరీ చేసి ఉడాయిస్తుంది.
ఎవరా మహిళ..
మెదక్ జిల్లాకు చెందిన రేణుక(26)కు కొన్నేళ్ల క్రితం తిమ్మాపూర్కు చెందిన వ్యక్తితో వివాహమైంది. దంపతుల్లిదరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కూలీ డబ్బులతో కుటుంబం గడవడానికే కష్టమైపోయేది. చిన్న చిన్న సరదాలకు కూడా డబ్బులు లేక ఇబ్బందిపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఈజీ మనీ కోసం రేణుక చోరీలకు అలవాటుపడింది. నేరెడ్మెట్,కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చింది.
మల్కాజ్గిరి అపార్ట్మెంట్లో రెక్కీ
జైలుకు వెళ్లి వచ్చినా రేణుక తీరు మాత్రం మారలేదు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదానగర్లోని ఓ అపార్ట్మెంట్లో రెక్కీ నిర్వహించి చోరీ చేసింది. అపార్ట్మెంట్లోని ఓ ఇంటిపై కన్నేసిన ఆమె.. ఆ దంపతులిద్దరూ ఉద్యోగస్తులు అని తెలుసుకుంది. ఉదయాన్నే పనికి వెళ్లే ఇద్దరూ రాత్రికి గానీ తిరిగిరారని తెలుసుకుంది. ప్లే స్కూల్లో చదువుకునే వారి పిల్లలిద్దరు సాయంత్రం ఇంటికి వస్తారని,తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఇంట్లో వారు మాత్రమే ఉంటారని తెలుసుకుంది. అలా ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5.30గంటలకు ఆ ఇంటికెళ్లింది.
బంగారం చోరీ..
ఆ సమయంలో పిల్లలు ఇద్దరూ ఆడుకుంటూ కనిపించారు. తాను వారి తల్లి స్నేహితురాలిని అని నమ్మించింది. తమ ఇద్దరికి చాలా కాలంగా స్నేహం ఉందని చెప్పింది. అదే ప్రాంతంలోని ఓ ఫంక్షన్కు వచ్చానని,దుస్తులు మార్చుకోవడానికి ఇంటికి వచ్చానని చెప్పి లోపలికి వెళ్లింది. దాదాపు అరగంట పాటు ఇంట్లోనే ఉన్న ఆ మహిళ.. 32.05గ్రా బంగారు ఆభరణాలను చోరీ చేసింది.
Recommended Video
పోలీసులకు ఫిర్యాదు..
రాత్రికి దంపతులిద్దరు ఇంటికి వచ్చాక చోరీ విషయం తెలిసి షాక్ తిన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి రేణుకను గుర్తించారు. గురువారం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. ఆమె వద్ద నుంచి రూ.1.30లక్షలు విలువచేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.