రూ.1లక్షకు వివాహిత విక్రయం... ముగ్గురి చేతుల్లోకి.. 9 నెలల నిర్బంధం,ఎట్టకేలకు ఇలా విముక్తి...
భర్తతో తలెత్తిన మనస్పర్థల కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ వివాహిత దారుణ పరిస్థితులను చవిచూసింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయ మాటలతో ఆకర్షించిన ఓ వృద్దురాలు ఏకంగా ఆమెను రూ.1లక్షకు అమ్మేసింది. అక్కడినుంచి ఆమె మరో ఇద్దరి చేతులు మారింది. అప్పుడు గానీ తాను మోసపోయానన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది. బయటపడే దారులన్నీ మూసుకుపోయాక ఎట్టకేలకు 9 నెలల నిర్బంధం తర్వాత ఆమెకు విముక్తి కలిగింది.
అసలేం జరిగింది...
సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఓ మహిళకు అదే పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఆమె అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆటోలో కామారెడ్డికి చేరుకొని, అక్కడి నుంచి రైలు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్లో దిగింది. భర్తపై కోపంతో క్షణికావేశంలో ఇంటిని వీడిన ఆ వివాహితకు సికింద్రాబాద్ చేరుకున్నాక ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో పాలుపోలేదు.
రూ.1లక్షకు విక్రయం...
దిక్కు తోచని పరిస్థితుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే ఆమె రెండు రోజులు గడిపింది. ఈ క్రమంలో ఓ వృద్దురాలు ఆమెను గమనించి పని ఇప్పిస్తానంటూ చేరదీసింది. దీంతో ఆ వృద్దురాలిని నమ్మి వెంట వెళ్లగా.. ఆమెను మహారాష్ట్రలోని పర్బణికి తీసుకెళ్లింది. అక్కడ మోరా అనే వ్యక్తికి ఆమెను వృద్దురాలు రూ.1లక్షకు విక్రయించింది. ఈ విషయం ఆమెకు తెలియక పని కోసమే తీసుకొచ్చిందేమోనని నమ్మింది. ఆ తర్వాత మోరా ఆమెను రాజారామ్ అనే వ్యక్తికి... అతను నాసిక్ సమీపంలోని ఓ కుగ్రామానికి చెందిన లక్ష్మణ్ జగపత్ అనే వ్యక్తికి విక్రయించాడు.
నిర్బంధం,ఎట్టకేలకు విముక్తి
అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న లక్ష్మణ్ జగపత్ ఆమెను మూడో భార్యగా ఉండాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తన ఇంట్లోనే బంధించాడు. ఈ క్రమంలో ఆమె పారిపోయే ప్రయత్నం చేయగా.. వెంటాడి పట్టుకున్నాడు. మరోసారి ఇలా పారిపోవడానికి యత్నిస్తే పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. ఆమెకు ఫోన్ అందుబాటులో లేకుండా చేశాడు. ఎట్టకేలకు ఈ నెల 25న ఆమె స్థానికుల సహాయంతో బంధువులకు తన సమాచారం అందించింది. దీంతో ఆమె భర్త వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీ గుర్తించి ఎట్టకేలకు విముక్తి కల్పించారు. బాధితురాలిని నిర్బంధించిన లక్ష్మణ్ జగపత్ను అరెస్ట్ చేశారు. 9 నెలల నిర్బంధం తర్వాత బయటపడ్డ బాధితురాలు మళ్లీ తన భర్తను చేరుకున్నందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తోంది.