నవ దంపతులపై దాడి, కిడ్నాప్.. భార్య బంధువులపైనే భర్త అనుమానం ..?
హైదరాబాద్ : వాళ్లిద్దరూ ప్రేమించారు.. పెళ్లి చేసుకున్నారు. సవ్యంగా సాగుతున్న కాపురంలో ఒక్కసారిగా అలజడి. అతని భార్య కనిపించడం లేదు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. తన భార్య ఆచూకీ కనుగొనాలని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను తనకు అప్పగించాలని వేడుకుంటున్నాడు. భార్య బంధువులే కిడ్నాప్ చేయించి ఉంటారని భావిస్తున్నారు.
హైదరాబాద్ అంబర్పేటలో రాజు ఉంటున్నారు. అతను బిందు అనే అమ్మాయిని ప్రేమించారు. వారి మనసులు కలిశాయి.. వారు ఒక్కటయ్యారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ సవ్యంగా కాపురం చేసుకుంటున్నారు. కొన్నాళ్ల వారి కాపురంలోకి కొందరు ఎంటరయ్యారు. నెలక్రితం వారి ఆచూకీ కనుగొన్నారు. ఇంట్లోకి చొరబడి అతని భార్యను ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన రాజును కొట్టారు. తర్వాత తేరుకున్న ఆయన తన భార్యను కిడ్నాప్ చేశారని వాపోయాడు.
వెంటనే అంబర్ పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. కానీ మన పోలీసులు ఇది మా పరిధిలోకి రాదని సింపుల్గా చెప్పేశారు. ఎల్బీ నగర్ పీఎస్కు వెళ్లాలని సూచించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా తన భార్య బంధువులే కిడ్నాప్ చేశారని భావిస్తున్నారు. రౌడీలతో కిడ్నాప్ చేయించి ఉంటారని అనుమానిస్తున్నాడు. ఈ కోణంలో కేసు విచారణ చేసి తన భార్య ఆచూకీ కనుగొనాలని వేడుకుంటున్నాడు. తననే నమ్ముకొని వచ్చిన తన భార్యను అప్పగించాలని కోరుతున్నారు.