మారుతిరావు మరణం వెనుక సంచలన కారణాలు.. అమృత ఫ్యామిలీని రహస్యంగా ఫొటోలు తీసి..
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రముఖ రియల్టర్, ప్రణయ్ హత్య కేసులో సూత్రధారి తిరునగరు మారుతీరావు అనుమానాస్పద మరణానికి సంబంధంచి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన శనివారం హైదరాబాద్ ఏ పని మీద వచ్చారు? ఎవర్ని కలిసేందుకు ప్రయత్నించారు? చనిపోడానికి ముందు ఏం చేశారు? ఏకారణంతో ప్రాణాలు తీసుకున్నారు? ఆస్తి తగాదాల సంగతేంటి? అనే వివరాల్ని పోలీసులు సేకరిస్తుండగానే మారుతిరావు లాయర్ వెంకటసుబ్బారెడ్డి సోమవారం మీడియా ముందుకువచ్చారు. చావుకు వెనకున్న కారణాలను ఆయన వివరించారు.
ఫోటోలు కాదు పేపర్లు కావాలి..
చనిపోయే ముందు చివరి నిమిషం వరకు కూడా ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోడానికే మారుతిరావు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ప్రణయ్ ని చంపినందుకు మారుతిరావు ఏనాడూ పశ్చాత్తాపం చెందలేదని, కేసు ట్రయల్ కు వచ్చేనాటికి కూతురు అమృత కచ్చితంగా తిరిగొస్తుందనే ధీమాతో ఉన్నాడని లాయర్ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రణయ్ హత్యకు సంబంధించి 302 సెక్షన్ తోపాటు ఎస్సీ,ఎస్టీ చట్టం కిందా చార్జిషీటు నమోదైందు కావడంతో.. అసలు ప్రణయ్ ఎస్సీ కాదు.. క్రిస్టియన్ అని నిరూపించడానికి మారుతిరావు చాలా ప్రయత్నాలు చేశారు. అమృత ప్రణయ్ ఫ్యామిలీని రహస్యంగా ఫొటోలు తీసి.. వాళ్లు గుడికి కాదు చర్చికి వెళతారని చెప్పే ఆధారాలను మారుతిరావు సేకరించాడు. అయితే మతం మారినట్లు ఫొటోల కంటే ఏదైనా పేపర్ ఎవిడెన్స్ ఉంటే బలంగా ఉంటుందని మారుతిరావుకు సూచించినట్లు లాయర్ సుబ్బారెడ్డి చెప్పారు.
సుభాష్ శర్మ బెదిరింపులు..
మారుతిరావు నుంచి సుపారీ తీసుకుని ప్రణయ్ ని నడిరోడ్డుమీదే నరికిచంపిన బీహార్ కిరాయి హంతకుడు సుభాష్ శర్మ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. తనను బయటికి తీసుకురాకపోతే బతుకు ఆగం చేస్తానని శర్మ పదేపదే మారుతిరావును బెదిరించినట్లు తెలుస్తోంది. బెయిల్ కోసం అమరావతి కోర్టులో వేసిన పిటిషన్ కొట్టుడుపోయిన తర్వాత శర్మ ఒత్తిడి పెంచాడని, మారుతిరావు మరణం వెనకున్న కారణాల్లో ఇది కూడా ఒకటయి ఉండొచ్చనే అభిప్రాయం వెల్లడవుతోంది. అయితే నూటికి నూరుశాతం కూతురి వల్లే అతను ప్రాణాలు తీసుకున్నాడని లాయర్ చెబుతున్నారు.
మూడు భాగాలుగా ఆస్తి పంపకం..
ప్రణయ్ హత్యకు ముందే మారుతిరావు తన ఆస్తినంతా కూతురు అమృత పేరుమీద రాశాడనటానికి ఆధారాలు లేవని, అయితే హత్య తర్వాత మాత్రం ఆయన తన ఆస్తిని మూడు భాగాలుగా పంచాడని.. భార్య గిరిజ, సోదరుడు శ్రవణ్, ట్రస్టుకు సమానంగా ఆస్తిని రాశాడని లాయర్ సుబ్బారెడ్డి చెప్పారు. పోలీసుల చార్జిషీటులోనూ ఈ విషయం స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. ట్రస్టుకు రాసిన భాగాన్ని కూడా తన పేరుమీదే రాయాలంటూ శ్రవణ్.. మారుతిరావుపై ఒత్తిడి తెచ్చాడనే విషయం తన దృష్టికి రాలేదని, అయితే, ఆస్తి గొడవలు, హత్య కేసు కంటే కూడా మారుతిరావుకు కూతురిపట్ల బెంగే ఎక్కువ ఉండేదని తెలిపారు.
చివరిసారి మాటలు కూడా ప్రణయ్ గురించే..
‘‘మారుతిరావు హైదరాబాద్ వచ్చింది నన్ను కలవడానికే. శనివారం రాత్రి 8:22కు నాతో ఫోన్ లో మాట్లాడాడు. ఆదివారం కలుద్దాం అని నేను చెప్పాను. బహుశా అదే చివరి కాల్ అయిఉంటుంది. చివరిగా మాట్లాడింది కూడా ప్రణయ్ హత్య కేసు గురించే. ఎలాగైనాసరే ప్రణయ్ ఎస్సీ కాదని నిరూపించడానికి చాలా కష్టపడ్డాడు. కోర్టు ట్రయల్ మొదలయ్యే నాటికి కూతురు తన ఇంటికొస్తుందని చాలా బలంగా నమ్మాడు.నిజానికి ప్రణయ్ హత్య కేసు కంటే ఏడేళ్ల ముందు నుంచే మారుతిరావుతో నాకు సంబంధాలున్నాయి. ఆయన భూవివాదం కేసుల్ని నేనే వాదించేవాడిని''అని లాయర్ వెంకటసుబ్బారెడ్డి అన్నారు.
అమృతతో రాజీకి విశ్వప్రయత్నం..
హత్య చేయించినందుకు మారుతిరావు ఏనాడూ ప్రశ్చాత్తాపం చెందలేదని, కేసు విచారణ మొదలయ్యేలోపు కూతురు వస్తుందనే దీమాతోనే ఆయన ఉన్నాడని, అయితే, రెండు వారాల కిందట మిర్యాలగూడలో కలిసినప్పుడు మాత్రం మొదటిసారి మారుతిరావు డీలాపడినట్లు కనిపించిందని లాయర్ సుబ్బారెడ్డి తెలిపారు. ‘‘హత్య తర్వాత కూడా అమృతతో రాజీ కుదుర్చుకునేందుకు తండ్రి తీవ్రంగా ప్రయత్నించాడు. మధ్యవర్తుల్ని పంపి మాట్లాడించాడు. కానీ ఆ అమ్మాయి వినలేదు. మధ్యవర్తులపైనా కేసులు పెట్టడంతో మారుతిరావు కంగుతిన్నాడు. అప్పటిదాకా కూతురు వస్తుందని బలంగా నమ్మిన ఆయన.. మొదటిసారి డీలాపడ్డాడు''అని వివరించారు.
కూతురి మాటలతో కోర్టు చిక్కులు..
ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి రెండు వారాల కిందటే చార్జిషీలు దాఖలైంది. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. ఈ కేసులో అమృతతోపాటు మొత్తం 102 మంది సాక్షులు ఉన్నారు. కోర్టు విచారణ మొదలయ్యేలోపే కూతురు అమృతను తనవైపు తిప్పుకునేందుకు మారుతిరావు విశ్వప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. అయితే మధ్యవర్తులపైనా అమృత కేసుల పెట్టిన తర్వాత మారుతిరావు నమ్మకం సన్నగిల్లిందని, తన కూతురు కోర్టులో కచ్చితంగా వ్యతిరేకంగానే సాక్ష్యం చెబుతుందని ఆయన భావించి ఉంటారని, ఆ విషయం అర్థమైన తర్వాతే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని ఉండొచ్చని లాయర్ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.
కూతురి కోసం చికెన్ తీసుకెళ్లేవాడు..
‘‘మారుతిరావుకు కూతురంటే పిచ్చి ప్రేమ. అతను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా.. ఆమెకు ఎంతో ఇష్టమైన మెక్ డోనాల్డ్స్ చికెన్ తీసుకెళ్లేవాడు. అదేంటండీ.. మీరు నాన్ వెజ్ తినరు కదా? అని అడిగితే.. తాను తిననుగానీ కూతురు తింటుందని, ఆమె సంతోషం కోసం ఏదైనా చేస్తానని చెప్పేవాడు. ఏనాటికైనా కూతురు తిరిగొస్తుందని కాన్ఫిడెంట్ గా ఉండేవాడు. ఆ నమ్మకం సన్నగిల్లడం వల్ల.. కూతురు లేని జీవితం వృథా అని భావించడం వల్లే మారుతిరావు బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు. నిజానికి ఆయన ఆత్మహత్య కేసుకునేంత పిరకివాడేమీకాదు. ఆయనపై పిసినారి అనే అపవాదు కూడా సరైందికాదు'' అని సీనియర్ లాయర్ వెంకటసుబ్బారెడ్డి అన్నారు.