మారుతిరావు కోసం స్మశానానికి కూతురు.. అమృత గోబ్యాక్ నినాదాలు.. దాడికి యత్నం.. కాపాడిన పోలీసులు..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వ్యాపారి, ప్రణయ్ హత్య కేసు నిందితుడు తిరునగరు మారుతీరావు అంత్యక్రియల్లో తీవ్రఉద్రిక్తత చోటుచేసుకుంది. కన్నతండ్రిని కడసారి చూసేందుకు కూతురు స్మశాన వాటికకు రాగా.. అక్కడున్నవాళ్లంతా ఆమెను బండబూతులు తిడుతూ వెనక్కి వెళ్లగొట్టారు. పోలీసుల సాయంతో రక్షక్ వాహనంలో స్మశానానికి వచ్చిన అమృతను చూడగానే బంధువులంతా ఒక్కరారిగా రెచ్చిపోయారు. 'గో బ్యాక్ అమృతా..'అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒకదశలో ఆమెపై దాడికి యత్నించారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. చివరికి తల్లి గిరిజ కూడా అమృతరాకను అసహ్యించుకుంది.
సూసైడ్ నోట్ లో చివరి కోరిక..
శనివారం హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో మారుతిరావు ఎలుకలమందు తిని ఆత్మహత్యకు పాల్పడటంతో సైఫాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మారుతిరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి ఆదివారం రాత్రే సొంతూరు మిర్యాలగూడకు పంపారు. సోమవారం ఉదయం పట్ణణంలోని షాబూనగర్ హిందూ స్మశానవాటికలో అత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేశారు. మారుతిరావు సూసైడ్ నోట్ లో చివరి కోరికగా కూతురు అమృతను తల్లి దగ్గరికి వెళ్లాలని కోరడం తెలిసిందే. తొలుత తటపటాయించినా చివరికి తండ్రిని చేసేందుకు అమృత అంగీకరించింది. అయితే..
Recommended Video
కండిషన్ మేరకు..
స్మశానానికి వెళితే బంధువులు హాని తలపెట్టొచ్చని ముందే అనుమానించిన అమృత.. పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే తండ్రిని చివరిసారి చూసొస్తానని తెలిపింది. ఆమేరకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈలోపే తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్.. అమృత రావొద్దంటూ ప్రకటనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. శ్రవణ్ మాత్రం తానలా అనలేదని వివరణ ఇచ్చుకున్నాడు. తీరా స్మశానానికి వెళ్లేసరికే అనుకున్నంతా జరిగింది. తండ్రి చావుకు కారణమైన అమృత గో బ్యాక్, మారుతీరావు అమర్ రహే అంటూ అక్కడి వాళ్లు నినాదాలు చేశారు.
ఏడుస్తూ వెనక్కి..
అమృతకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన మారుతిరావు సమర్థకులు.. ఒకదశలో ఆమెపై దాడి చేసేందుకు కారువైపు దూసుకొచ్చారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి.. ఆమెకు వెంటే కారులో కూర్చొబెట్టి వేగంగా బయటికి తీసుకొచ్చారు. తీవ్ర నిరసన ఎదురుకావడంతో తండ్రి మృతదేహాన్ని కడసారి చూడకుండానే అమృత ఏడుస్తూ వెనక్కివెళ్లిపోయింది. పోలీసులు ఆమెను ప్రణయ్ ఇంటి వద్ద దింపేశారు. అమృత స్మశానం నుంచి వెళ్లిపోయిన తర్వాత మారుతిరావు అంత్యక్రియలు ప్రశాంతంగా జరిగాయి.
మారుతిరావు అన్న కూడా ఇలాగే..
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతిరావుకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఆయన ఎలాగైతే హైదరాబాద్ ఆర్యవైశ్య భవన్ లో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడో.. సరిగ్గా 33 ఏళ్ల కిందట మారుతిరావు సోదరుడు తిరునగరు నాగేందర్ కూడావిజయవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారుతిరావు అంత్యక్రియల సందర్భంగా సోదరులిద్దరూ ఇంటికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయిన తీరును స్థానికులు గుర్తు చేసుకున్నారు.
ఇదీ మారుతిరావు ప్రస్థానం..
35 ఏళ్ల కిందట కిరోసిస్ డీలర్ గా వ్యాపారంలోకి అడుగుపెట్టిన మారుతిరావు.. అనతికాలంలోనే రియల్టర్ గా, బిల్డర్ గా తిరుగులేని స్థాయికి ఎదిగాడు. కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయన వ్యాపారానికి మరింతగా పనికొచ్చాయి. వైఎస్ జమానాలో నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి సహకారంతో పెద్ద ఎత్తున భూకొనుగోళ్లు, అమ్మకాలు సాగించడంద్వారా కోట్లకు పడగెత్తాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అమృత.. దళిత యువకుడైన ప్రణయ్ ని ప్రేమవివాహం చేసుకోవడాన్ని పరువు తక్కువగా భావించి, ప్రణయ్ ని హత్య చేయించాడు. ఆ కేసులో బెయిల్ పై ఉన్న మారుతిరావు.. గతవారం జరిగిన మరో పరిణామంతో మళ్లీ వార్తల్లోకెక్కాడు. మారుతిరావుకు చెందిన షెడ్డులో కుళ్లిపోయిన శవరం పోలీసులకు లభించింది. అది ఎవరిదో ఇంకా తేలకముందే హైదరాబాద్ లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు.