మిస్టరీగా మారిన మారుతిరావు మరణం.. గదిలో దొరకని ఆధారాలు.. తండ్రి అత్యక్రియలకు అమృత?
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రముఖ వ్యాపారి, సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతిరావు మరణం మిస్టరీగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధామికంగా ఇది ఆత్మహత్యేనని అభిప్రాయపడినప్పటికీ.. అతని గదిలో దానికి సంబంధించిన ఆధారాలేవీ లభించకపోవడంతో తలలు పట్టుకున్నారు. మరోవైపు భారీ బందోబస్తు నడుమ మారుతిరావు మృతదేహాన్ని పోలీసులు మిర్యాలగూడకు చేర్చారు. తండ్రి అత్యక్రియలకు కూతురు అమృత వెళుతుందనే వార్తల నేపథ్యంలో రెండు ఇళ్ల వద్దా పోలీసులు భారీగా మోహరించారు.
ఆ రెండు గంటలు ఏం జరిగింది?
వ్యాపారి మారుతిరావు.. శనివారం రాత్రి తన డ్రైవర్ రాజేశ్ తోకలిసి హైదరాబాద్ వచ్చాడు. ఖైరతాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్యభవన్ లో రూమ్ నంబర్ 306లో దిగాడు. మారుతిరావు గదిలో ఉండగా, డ్రైవర్ మాత్రం బయటే ఉన్నాడు. ఆదివారం ఉదయం మారుతిరావు భార్య పలు మార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో, డ్రైవర్ ను విచారించింది. దీంతో డ్రైవర్ రాజేశ్.. ఆర్యవైశ్య భవన్ లో మారుతిరావు ఉన్న గదికి వెళ్లి తలుపు తట్టగా తీయలేదు. భవన్ సిబ్బంతితోకలిసి తలుపులు బద్దలుకొట్టగా లోపల మారుతిరావు విగతజీవిగా కనిపించాడు. అయితే, శనివారం రాత్రి 6:50 నుంచి 9:00 గంటల మధ్య మారుతిరావు గదిలో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది.
Recommended Video
సింకులో వాంతి చేసుకుని..
మారుతిరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాధమికంగా నిర్ధారించామని సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి మీడియాకు చెప్పారు. అయితే ఆయన పురుగుల మందు తాగారనడానికి గదిలో ఆధారాలు దొరక్కపోవడం సంచలనంగా మారింది. పోలీసులు ఎంటర్ అయ్యేటప్పటికి.. ఆర్యవైశ్య భవన్ రూమ్ నంబర్ 306లో ఎలాంటి పురుగుల మందు డబ్బాకానీ.. లేదా దాన్ని వాడినట్లు ఆధారాలుగానీ లభించలేదు. సాయంత్రం 6:50కి గదిలో దిగిన తర్వాత డ్రైవర్ను కిందికి పంపి గారెలు తెప్పించుకుని తిన్నాడని, అయితే వెంటనే వాంతులు చేసుకున్నాడని వెల్లడైంది. దీనికి సంబంధించి రూమ్ సింకులో వాంతి నమూనాను కూడా ఫోరెన్సిక్ విభాగం సేకరించింది.
ఎక్కడ సేవించారు?
మారుతిరావు శనివారం రాత్రి 9గంటలకు చనిపోయిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే గారెలు తిని, వాంతి చేసుకున్న తర్వాత ఆయన ఓ సారి గది నుంచి బయటికి వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. బయట ఎవరినైనా కలిశారా? లేదా? అనే విషయాన్ని కనిపెట్టేందుకు మారుతిరావు కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మిర్యాలగూడలోని ఓ స్నేహితుడి దుకాణంలో మారుతిరావు పురుగుమందుల డబ్బాను కొనుగోలు చేసినట్లు వెల్లడయినప్పటికీ.. ఆర్యవైశ్య భవన్ లోని గదిలో మాత్రం దానికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు. అతను పురుగుత మందును ఎక్కడ సేవించారనేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఆస్తి తగాదాలే కారణమా..
ఉస్మానియా ఆస్పత్రిలో పంచనామా తర్వాత మారుతిరావు మృతదేహాన్ని పోలీసు ఎస్కార్టు సాయంతో మిర్యాలగూడకు తరలించారు. భర్త మృతదేహాన్ని చూసి మారుతిరావు భార్య గిరిజ కుప్పకూలిపోయారు. అటు కూతురు దూరమై, అల్లుడు హత్యకు గురై, చివరికి భర్త కూడా ప్రాణాలు విడవడంతో ఆమె గుండెలు బాదుకుంటూ రోదించారు. ఒకదశలో స్పృహకోల్పోయి భర్త శవంపైనే పడిపోయారు. కాగా, ఆస్తి గొడవల నేపథ్యంలో మారుతిరావుకు అతని సోదరుడు శ్రవణ్ హాని తలపెట్టి ఉంటారనే కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో శ్రవణ్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు.. సోదరుడు మారుతిరావుతో గత ఏప్రిల్ నుంచి మాట్లాడటంలేదని, తమ మధ్య ఆస్తి తగాదాలేవీ లేవని, బహుశా, పోలీసుల వేధింపులు, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని శ్రవణ్ అన్నారు.
అమృత ఇంటి వద్ద భారీ బందోబస్తు..
హైదరాబాద్ లో మారుతిరావు చనిపోయిన గది నుంచి పోలీసులు ఓ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘గిరిజా క్షమించు.. అమృతా అమ్మ దగ్గరికి వెళ్లు''అని రాసుంది. లెటర్ వెలుగులోకి రావడానికి ముందే అమృత తన తండ్రి మరణంపై స్పందించింది. తండ్రి మరణానికి సంబంధించిన నిజానిజాలేమిటో తనకు తెలియవని, బహుశా, ప్రణయ్ ని చంపిన పశ్చాతాప్తంతోనే చనిపోయి ఉండొచ్చని అమృత పేర్కొన్నారు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లేలా అమృతను బంధువులు ఒప్పించినట్లు తెలుస్తోంది. మారుతిరావు మరణవార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అమృత ఇంటివద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆ శవం ఎవరిది?
ప్రణయ్ హత్య కేసులో బెయిల్ పై ఉన్న మారుతిరావు సడెన్ గా ఓ అనుమానాస్పద మృతి కేసుతో మళ్లీ వార్తల్లోకెక్కాడు. గతవారం.. మిర్యాలగూడ శివారు అద్దంకి-నార్కట్పల్లి బైపాస్ రోడ్డులో మారుతిరావుకు చెందిన పాత షెడ్డులో కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చని, జీన్స్ ప్యాంటు, బ్లూషర్టు ధరించి ఉన్నాడని మిర్యాలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే ఆ మృతదేహం ఎవరిదనేది ఇంకా తేలలేదు. ఈ కేసుతో మారుతిరావుకు సంబంధం ఉందా? లేదా? అని తేలకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు.