భద్రకాళీ ఫైర్వర్క్స్లో భారీ అగ్నిప్రమాదం: 11మంది సజీవదహనం, కేసీఆర్ దిగ్భ్రాంతి
వరంగల్: నగర శివారులోని కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారీ గోదాంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 11మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ప్రమాదవశాత్తు టపాసులు పేలడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
టపాసుల పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయాయి. మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో మృతుల బంధువులు రోదనలు మిన్నంటాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనాస్థలిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, సీపీ రవీందర్ తో పాటు పలువురు పరిశీలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద మొత్తంలో పటాకులు పేలినట్లు తెలిపారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
కేసీఆర్ దిగ్బ్రాంతి: రూ.5లక్షల పరిహారం
భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.