'మహా మోసగాడు' : కోట్లు సంపాదించాలని స్కెచ్.. అడ్డంగా బుక్
హైదరాబాద్ : మోసగాళ్లు చాలా స్మార్ట్ గా మారిపోతున్నారు. చీప్ ట్రిక్స్ ను పక్కనబెట్టి.. హుందాగా కోట్లు గడించేందుకు స్కెచ్ లు వేస్తున్నారు. తాజాగా ఎన్జీవోల పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్న నాగేశ్వరరావు అనే ఓ మోసగాడికి చెక్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు.
నాగేశ్వరరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడం కాగా.. నగరంలోని మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న శివపురి కాలనీలో చాలా ఏళ్ల క్రితమే స్థిరపడ్డాడు. ఎన్జీవోల ముసుగులో దోచుకోవడమే ధ్యేయంగా.. తొలుత రూ.5 వేలతో న్యూఢిల్లీలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్ కమిషన్ అనే రెండు ఎన్జీవోల సంస్థలను రిజిస్టర్ చేయించాడు.
వీటి కార్యచరణకు సంబంధించి.. సంస్థల ధ్రువపత్రాల్లో నాగేశ్వరరావు పేర్కొన్నదేంటంటే.. తాను రిజిస్టర్ చేసుకున్న ఆయా సంస్థల ద్వారా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, అధికారుల అవినీతిపై ప్రచారం చేస్తామని దరఖాస్తుల్లో పేర్కొన్నాడు. సదరు సంస్థలకు తానే జాతీయ అధ్యక్షుడిగా ప్రచారం కూడా చేసేసుకున్నాడు.
ఇక ఆ సంస్థలకు మండల, జిల్లా స్థాయి పోస్టులంటూ పలువురికి ఆశజూపి డబ్బులు గుంజే ప్రయత్నం చేశాడు. సాధారణ సభ్యత్వానికి రూ.1500, రెండేళ్ల కాలపరిమితి ఉండే మిగతా పోస్టులకు రూ.30 వేల నుంచి 2 లక్షల వరకు రేటు నిర్ణయించాడు. ఈ మొత్తం వ్యవహారం ద్వారా ప్రతీ రెండేళ్లకు రూ.5కోట్లు వెనకేసుకోవాలన్నది నిందితుడు నాగేశ్వరరావు ప్లాన్.
ఈ రెండు సంస్థలు గాక.. యాంటీ కరెప్షన్ కమిటీ పేరుతోను మోసాలకు కుట్ర పన్నాడు. తెలుగు ప్రపంచం అనే మరో సంస్థనూ రిజిస్తర్ చేయించిన నాగేశ్వరరావు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆయా వ్యాపార సంస్థల దుకాణాలకు తెలుగు బోర్డులు ఏర్పాటు చేయించే బాధ్యతలను ప్రభుత్వాలు తనకు అప్పగించాయని అందరిని నమ్మించి ప్రయత్నం చేశాడు.
కన్జ్యూమర్ రైట్స్ పేరుతో ఓ మాసపత్రికను కూడా రిజస్టర్ చేయించిన నాగేశ్వరరావు.. తనవద్ద సభ్యులుగా ఉన్నవారికి రూ.500 నుంచి వెయ్యి రూపాయల మేర స్టిక్కర్లు విక్రయించేవాడు. ఇవీగాక అభయ ఛానల్ ఎండీగా.. బీ4యూ న్యూస్ ఛానల్ హెడ్ గా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్ మెంట్ కోశాధికారిగా.. ఇలా చెప్పుకుంటూ పోతే నాగేశ్వరరావు మోసాల లిస్టు పెద్దదిగానే ఉంది. అయితే నాగేశ్వరరావు వ్యవహారమంతా పోలీసుల చెవిన పడడంతో.. మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని నిజాలన్ని కక్కించారు.