రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి : వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు.. అయినా ఆపద రానివ్వను !!
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈరోజు అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. లష్కర్ బోనాల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత తన భక్తులను తానే కాపాడుకుంటామని, ఎంత పెద్ద ఆపద వచ్చినా రక్షించి తీరుతానని అమ్మవారి వాక్కుగా చెప్పారు .
జోరుగా తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల బిజినెస్ .. ఆ ట్రావెల్స్ పై కేసు పెట్టిన టీటీడీ
లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో పచ్చి కుండపై నిలబడి తనలోనికి అమ్మవారిని ఆవాహన చేసుకుని భవిష్యవాణి చెప్పారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టిందని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు తనను నమ్మి పూజలు చేశారని, వారిని కాపాడే బాధ్యత తనదేనని చెప్పారు. మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి సంకోచం లేకుండా ఉత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి వర్షాలతో రైతులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటారని స్వర్ణలత పేర్కొన్నారు .వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్న మాతంగి స్వర్ణలత తాను ప్రజల వెంట ఉండి ముందుకు నడిపిస్తారని స్పష్టం చేశారు.
అమ్మకి ఇంత చేసినా ఏమీ ఒరగలేదు అనొద్దు అని పేర్కొన్న స్వర్ణలత ప్రతి ఒక్కరిని తాను కాపాడుకుంటానని ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వనని స్పష్టం చేశారు. గతేడాది రంగంలో మాతంగి స్వర్ణలత చెప్పినట్టుగానే హైదరాబాద్ లో వరదలు ముంచెత్తాయి. ఈ ఏడాది కూడా వర్షం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని మాతంగి స్వర్ణలత చెప్పడం కాస్త ఆందోళన కలిగించినా తన భక్తులను తానే తప్పక కాపాడుకుంటానని చెప్పడంతో అందరూ కాస్త ఊపిరి తీసుకున్నారు. ఇక ఈ రంగం కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.