ప్రజలను బాధపెట్టొద్దు, సగం సంతోషమే: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
హైదరాబాద్: నగరంలోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన 'రంగం'లో మాతంగి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ఈ సందర్భంగా పూజారులు, ఇతరులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ప్రజలను పాలకులు ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు.
కొంత సంతోషం.. కొంత బాధ
పాలకులు, ప్రజలు అందరూ తన బిడ్డలేనని అన్నారు. బంగారు బోనం సమర్పించాం, అంత సవ్యంగా చేశామని.. సంతోషమే కదా అమ్మా.. అని పూజారులు అడగ్గా.. నా బోనం నాకే సమర్పించారు కదరా బిడ్డా అని అన్నారు స్వర్ణలత. బంగారం బోనంతో కొంత సంతోషం, కొంత బాధ ఉందని అన్నారు.
మహిళలు బాధపడుతున్నారు
అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మహిళలు బాధ పడ్డారని అన్నారు. పాలకులు ప్రజలకు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారని.. కానీ, బాధ పెడుతున్నారని స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పారు. ఈ ఏడాదంతా సంతోషం లేకుండా పోయిందని అన్నారు.
వారిని శిక్షిస్తాను.. రక్షిస్తాను
కొందరు హైందవ ధర్మంపై విమర్శలు చేస్తున్నారని చెప్పం.. తాను న్యాయం పక్షానే ఉంటానని అమ్మవారి పూనకంలో ఉన్న స్వర్ణలత స్పష్టం చేశారు. ధర్మంపై విమర్శలు చేసేవారిని శిక్షిస్తానని, రక్షిస్తానని చెప్పారు.
నా బిడ్డలకు ఆపద రానివ్వను..
వర్షాలు పడక రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని పూజారులు చెప్పగా.. కోరినన్ని వర్షాలు కురుస్తాయని అన్నారు. వర్షాలు బాగా కురుస్తాయని, పాడిపంటలు బాగుంటాయని చెప్పారు. తన బిడ్డలకు ఎలాంటి ఆపదా రానివ్వనని స్వర్ణలత చెప్పారు.