'అందం' చూసి పడ్డారో అంతే సంగతి.. భర్త,కొడుకు సాయంతోనే ఆమె అలా రెచ్చిపోయింది..
ఆమె ఓ కిలేడీ.. మ్యాట్రిమోనిలో అందమైన యువతుల ఫోటోలతో అబ్బాయిలను ఆకర్షిస్తుంది. ఫోటో మెచ్చి ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించారో.. ఇక అంతే సంగతి. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను.. మీ లాంటి వారే నాకు కావాలి అని నమ్మిస్తుంది. ఈ క్రమంలో అందినకాడికి దోచుకుంటుంది. మోసపోయామని తెలుసుకునే లోపే బ్యాంకు ఖాతాలో డబ్బులు ఊడ్చుకుపోతాయి. ఇలా ఇప్పటివరకూ ఆ కిలేడీ దాదాపు రూ.5కోట్లు వరకు మోసాలకు పాల్పడింది. ఇటీవల హైదరాబాద్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. కూపీ లాగిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు.
ఇలా వెలుగులోకి..
హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. మ్యాట్రిమోనిలో ఓ మహిళ తన నుంచి రూ.65లక్షలు కాజేసిందని తెలిపాడు. కేపీహెచ్బీకి చెందిన మరో యువకుడు కూడా స్థానిక పోలీసులను ఆశ్రయించి.. మ్యాట్రిమోనిలో ఓ మహిళ తన నుంచి లక్షల్లో డబ్బు కాజేసిందని ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఘటనలపై వేర్వేరు కేసులు నమోదవగా.. మోసం చేసిన మహిళ ఒకరేనని తేలింది. అంతేకాదు,హబ్సిగూడకు చెందిన మరో వ్యక్తి నుంచి ఆమె రూ.3.5కోట్లు కాజేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఫేక్ ఐడీలతో బురిడీ..
మ్యాట్రిమోనిలో ఆమె పొందుపరిచిన వివరాలు ఫేక్ అని గుర్తించారు. ఒకే మహిళ వేర్వేరు ఐడీలతో వేర్వేరు వ్యక్తులకు టోకరా వేసినట్టు గుర్తించారు. ఆమె ఫోన్ నంబర్,ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టారు. మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఆమె భర్త,కుమారుడు కూడా సహాయం చేసినట్టు తేలడం గమనార్హం. పోలీసులు ఈ ముగ్గురి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా కేవలం రూ.500,రూ.1300,రూ.2500 మాత్రమే ఉన్నట్టు గుర్తించారు.
Recommended Video
గోశాల నిర్వహిస్తున్నామన్న నిందితురాలు..
యువకుల నుంచి కాజేసిన డబ్బుతో నగరంలోని ఓ చోట గోశాల నిర్వహిస్తున్నామని నిందితురాలు పోలీసులతో చెప్పడం గమనార్హం. గోశాల నిర్వహించడానికి ఇలా మోసాలకు పాల్పడాల్సిన అవసరమేముందన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని.. తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఆమె రూ.5కోట్లు వరకు దోచుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. మ్యాట్రిమోనిలో ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలు ఎక్కడి నుంచి సేకరించిందో ఆరా తీస్తున్నారు. త్వరలోనే వాస్తవాలు వెలికితీస్తామని పోలీసులు దీమాగా చెబుతున్నారు.