మ్యాట్రీమోనీ ప్రేమ, పెళ్లి: 4రోజులకే నరకం, యూకేకు భర్త, భార్య ఆందోళన బాట
హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. అంతేగాక, తమ తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పి.. ఆమెను వివాహం చేసుకున్నాడతను. ఆ తర్వాత నాలుగో రోజు నుంచే ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ మహిళ మహిళా సంఘాలను ఆశ్రయించి ఆందోళనకు దిగింది.
సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు ప్రశాంతి మహిళా సంఘాలతో కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. వరంగల్ జిల్లా రామన్నపేట కు చెందిన తనకు గతంలోనే వివాహం అయిందని తెలిపింది.
కొన్ని కారణాలతో విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి మ్యాట్రిమోనియల్ డాట్కామ్లో బయోడేటా ఇచ్చానని, దానిని చూసి యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎల్బి నగర్ నివాసి ఎస్ శ్రావణ్కుమార్ తనకు ఫోన్ చేశాడని తెలిపింది. సంబంధం నచ్చిందంటూ ఫోన్లో మాట్లాడేవాడని చెప్పింది.
'నిన్ను పెళ్లి చేసుకోవడం మా కుటుంబ సభ్యులకు ఇష్టంలేదు. వారికి తెలియకుండా పెళ్లి చేసుకుందాం' అని నమ్మబలికాడని బాధితురాలి తెలిపింది. 2015 ఆగస్టులో శ్రావణ్ యూకే నుంచి వచ్చి పెళ్లి చేసుకుందామి చెప్పాడని తెలిపింది.
ఈ క్రమంలో ఆగస్టు 6న వరంగల్లోని ఎర్రగట్టు దేవస్థానంలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఆ తర్వాత శ్రావణ్ తనను నగరంలోని తన ఇంటికి తీసుకెళ్లాడని, రెండు రోజులు బాగానే చూసుకున్నా.. తరువాత అత్త అనసూయమ్మ, శ్రావణ్ సోదరులు రమేశ్, సురేశ్, ఉమేశ్, సతీశ్, వదినలు శ్రీలత, సుజాత, శ్రావణి, సుధారాణి, ఆడపడుచులు లలిత, జ్యోతితోపాటు కుటుంబసభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించారని వాపోయింది.
తనను ఇంట్లోంచి గెంటేసి శ్రావణ్ను యూకేకి పంపించారని, అతడి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. గత సంవత్సరం నవంబర్ 10న వరంగల్ కమిషనర్కు ఫిర్యాదు చేశానని, ఆయన సూచనల మేరకు మట్టేవాడ పోలీసుస్టేషన్కు వెళ్లగా అక్కడ అధికారులు పట్టించుకోలేదని వాపోయింది.
అనంతరం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశానని, ఆయన వరంగల్ కమిషనర్తో మాట్లాడినా న్యాయం జరగలేదని వెల్లడించింది. తనకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితురాలు చెప్పింది.