కరివేపాకులా వాడుకుని వదిలేశారు: చంద్రబాబుపై మత్తయ్య ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కరివేపాకు మాదిరిగా వాడుకొని వదిలేశారని, దాంతో తనకు రక్షణ కరువైందని ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరూసలేం మత్తయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సి)కి ఫిర్యాదు చేశారు.
తాను సుమారు ఆరు నెలల నుంచి ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నందున తనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి, కేసులో ప్రతివాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. తన ఇంటి వద్ద కొందరు తనను చంపేందుకు రెక్కి నిర్వహించినట్లు తెలిసిందన్నారు.
ఇంటి వద్ద పోలీసు రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడాలని హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తన ప్రస్తుత పరిస్థితికి కారకులని ఆరోపించారు. ఆయన వెంట ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బిషప్ స్వామిదాస్ ఉన్నారు.