వ్యూహకర్త ప్రశాంత్ ప్లాన్, కేసీఆర్కు చెక్: తెరపైకి అజహరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షులు రానున్నారా? అంటే అవుననే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. పార్టీలో విభేదాలు, ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన పలువురి అసంతృప్తి... తదితరాల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం చూస్తోందంటున్నారు.
రేసులో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్, విజయశాంతి, డీకే అరుణ పేర్లు కూడా ఉన్నాయనే వార్తలు చాలా రోజుల క్రితం వచ్చాయి. అయితే, అజారుద్దీన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
గ్లామర్ పాలిటిక్స్ దిశగా తెలంగాణ కాంగ్రెస్..! : 'పీసీసీ చీఫ్ గా అజారుద్దీన్..?'అజారుద్దీన్ను అధ్యక్షుడిగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం ఉంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయమై ఆయన సోనియా, రాహుల్, ప్రియాంకలతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారంటున్నారు.
ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో మైనారిటీలకు లేదా ఎస్సీలకు చెందిన నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని అంటున్నారు. అందుకే, డీకే అరుణ, విజయశాంతిల పేర్లు రేసు నుంచి పక్కకు పోయాయని చెబుతున్నారు.
మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ, అజారుద్దీన్ పేర్లు, స్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్, గీతారెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయని చెబుతున్నారు. అంతిమంగా అజారుద్దీన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు.
అజారుద్దీన్ అయితే...
తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా అజారుద్దీన్ అయితే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని లెక్కలు వేస్తున్నారని అంటున్నారు. అధికార తెరాస పార్టీ మజ్లిస్ పార్టీతో జట్టు కట్టింది. నాలుగేళ్ల క్రితం ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఉంది. దీంతో ముస్లీంలు ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారనే వాదన ఉంది.
ఇప్పుడు మజ్లిస్.. తెరాసతో ఉన్నందున మైనార్టీలు కారు పార్టీ వైపు వెళ్లారని భావిస్తున్నారు. మరోవైపు, కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అంటూ చెబుతున్నారు.
మోడీని, నితీష్ల వెనుక ప్రశాంత్: 2016లో మమతకు?దాదాపు మైనార్టీలు అధికార పార్టీ వైపు ఉన్నారని, అజారుద్దీన్ను నియమిస్తే వారు కాంగ్రెస్ వైపు మరలుతారని భావిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా ఉంటుందని భావిస్తున్నారంటున్నారు. ముఖ్యంగా, అజారుద్దీన్ ద్వారా కేసీఆర్కు దగ్గరైన మైనార్టీలను మళ్లీ తమ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారని అంటున్నారు.