తెలంగాణలో కొత్త పత్రిక?: కేసీఆర్ 'నమస్తే'కు పోటీగా దిగుతున్న సీఎల్ రాజం..
తెలంగాణలో మరో పత్రికకు కావాల్సినంత స్పేస్ ఉండటంతో సీఎల్ రాజం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు నమస్తే తెలంగాణ అనే పత్రిక ఇక్కడి ప్రజల గొంతుకగా పనిచేసింది. ఒకరకంగా తెలంగాణకు సొంత మీడియా లేని రోజుల్లో.. ఉద్యమం మొత్తాన్ని తన భుజాల మీద మోసింది.
కానీ ప్రత్యేక రాష్ట్రం సాధించి, అధికారం గులాబీ హస్తగతం అయిన తర్వాత.. ఇప్పుడా పత్రిక అధికార పార్టీ కరపత్రంగానే ఎక్కువగా గుర్తించబడుతోంది. ఒకప్పుడు ప్రజా ఆకాంక్షలను ప్రతిబింబించిన పత్రిక.. ఇప్పుడు కేవలం పైనుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే మోస్తున్నట్లు కనిపిస్తోంది.
నవతెలంగాణ లాంటి పత్రికలు తెలంగాణలో సమస్యల్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతున్నప్పటికీ.. అవి వామపక్షాల చేతుల్లో ఉండటంతో పారదర్శకత కొరవడిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీల జోక్యం లేని పత్రిక ఒకటి వస్తే బాగుండు అన్న అభిప్రాయాలు తెలంగాణలో వ్యక్తమవుతున్నాయి.
సీఎల్ రాజం కొత్త పత్రిక:
తెలంగాణలో మరో పత్రికకు కావాల్సినంత స్పేస్ ఉండటంతో మెట్రో ఇండియా చీఫ్, ఎస్ఈడబ్ల్యూ అధినేత సీఎల్ రాజం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు నమస్తే తెలంగాణ పత్రికకు ఎండీగా ఉన్న ఆయన.. ఆ తర్వాతి రోజుల్లో బలవంతంగా దాని నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకరకంగా సీఎం కేసీఆర్ ఆయన నుంచి పత్రికను లాక్కున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
రాజంకు సవాలే?:
ప్రస్తుతం సీఎల్ రాజం బీజేపీలో కొనసాగుతుండటంతో.. ఆయన ప్రారంభించబోయే పత్రిక ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. కొత్త పత్రిక కూడా మరో పార్టీ కరపత్రంగానే గుర్తించబడుతుంది తప్ప ప్రజల మాద్యమంగా గుర్తించబడదు.
పార్టీలో కొనసాగుతూ పత్రికపై ఆ నీడ పడకుండా నడిపించడం.. అంత పారదర్శకంగా వ్యవహరించడం సీఎల్ రాజంకు పెద్ద సవాలే. ఆ సవాల్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటే పత్రిక నిలబడుతుంది లేదంటే.. నమస్తే తెలంగాణ విషయంలో జరిగిందే మళ్లీ రిపీట్ అవుతుంది.
ఆ ప్రచారంలో నిజమెంత?:
సీఎల్ రాజం కొత్త పత్రిక తీసుకొస్తున్నారనేది ఒక చర్చ అయితే.. దానికి అల్లం నారాయణ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నారనేది మరో చర్చ. అల్లం నారాయణ ఇప్పుడు కేసీఆర్ అనుయాయిగా నడుచుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా మొన్నామధ్యే పదవీ కాలాన్ని కూడా పొడగించారు. ఇలాంటి తరుణంలో ఆయన ఆ పదవి నుంచి బయటకొచ్చి.. సీఎల్ రాజం పత్రికకు ఎడిటర్గా వ్యవహరిస్తారన్న ప్రచారం జరగడం పూర్తిగా గాలి వార్తే అన్న వాదన వినిపిస్తోంది.
నమస్తేకు పోటీగా:
తాజా సమాచారం ప్రకారం సీఎల్ రాజం దసరా పండుగ రోజునే కొత్త పత్రికకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అయితే పత్రికకు సంబంధించిన స్పష్టమైన వివరాలేవి తెలియరాలేదు. రాజం బీజేపీలో ఉన్నందునా.. ఆ పార్టీకి అనుబంధంగానే పత్రికను నడిపిస్తారా?.. లేక ప్రజల పక్షాన నిలబడుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
తెలంగాణ ప్రజలు మాత్రం తమ గొంతు వినిపించే పత్రిక కోసం ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం. సర్కార్ తప్పొప్పుల్ని నిక్కచ్చిగా చూపించే పత్రికకు కచ్చితంగా ఆదరణ ఉంటుందన్నదీ వాస్తవం. ఆ దిశగా పనిచేయగలిగితే మాత్రం ఒకప్పుడు నమస్తే తెలంగాణ పత్రికకు ఉన్నంత ఆదరణను సొంతం చేసుకోవచ్చు. అదే జరిగితే నమస్తే పత్రిక కూడా పోటీని ఎదుర్కోక తప్పదు.