ఖమ్మం ‘కారు’ పోరు: మేయర్, ఉప మేయర్ మధ్య వాగ్వాదం
ఖమ్మం ‘కారు’(టీఆర్ఎస్ పార్టీ)లో ‘పోరు’ సాగుతోంది. ఖమ్మం నగర కార్పొరేషన్ టీఆర్ఎస్ చేతిలో ఉంది. మేయర్ గా డాక్టర్ పాపాలాల్, ఉప మేయర్ గా బత్తుల మురళి ప్రసాద్ ఉన్నారు.
ఖమ్మం: ఖమ్మం 'కారు'(టీఆర్ఎస్ పార్టీ)లో 'పోరు' సాగుతోంది. ఖమ్మం నగర కార్పొరేషన్ టీఆర్ఎస్ చేతిలో ఉంది. మేయర్ గా డాక్టర్ పాపాలాల్, ఉప మేయర్ గా బత్తుల మురళి ప్రసాద్ ఉన్నారు. ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీవారే. ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరి మధ్య బుధవారం మాటల యుద్ధం సాగింది.
''నాది ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితం.. మీరు రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లు కాలేదు.. ఇదే విధంగా పాలన కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవు.. ఇప్పటికే ప్రజలు పాలకవర్గంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. మీ ప్రవర్తన మార్చుకోకపోతే మేమంతా ఇబ్బందులు పడాల్సివస్తుంది.. ఉప మేయర్ ఫోన్ చేస్తే స్పందించరా?.. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి'' అంటూ, ఖమ్మం నగర పాలకసంస్థ మేయర్ డాక్టర్ పాపాలాల్పై.. ఉప మేయర్ మురళీప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది, బుధవారం సాయంత్రం నగర పాలక సంస్థ మేయర్ ఛాంబర్లో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కొందరు సిబ్బంది సమక్షంలోనే వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగింది. మేయర్, ఉప మేయర్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అధిపత్య పోరు బుధవారం తారాస్థాయికి చేరుకుంది. నెల రోజుల క్రితం 24వ డివిజన్ను సందర్శించాలని మేయర్ పాపాలాల్ ఉపమేయర్ మురళీప్రసాద్కు సమాచారం అందించిన సమయంలో తాను నగరంలో లేనని, సందర్శనకు రావద్దని చెప్పడం.. మేయర్ ఆ డివిజన్లో జరుగుతున్న మురుగు కాలువ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లగా స్థానిక తెరాస నాయకులు అక్కడకు వెళ్లి మేయర్ను అడ్డుకోవడం వారి మధ్య వివాదానికి దారి తీసింది.
Recommended Video
ఈ తరుణంలో నగరపాలకంలో బుధవారం సాయంత్రం పారిశుద్ధ్య సిబ్బందితో ఏర్పాటుచేసిన సమావేశానికి బొడ్డు ప్రసాద్ అనే జవాన్ హాజరు కాకపోవడంతో మేయర్ వెంటనే ప్రసాద్ను పిలవాలని పారిశుద్ధ్య పర్యవేక్షకుడికి సూచించారు. దీంతో ఎస్ఐ ముర్తుజా జవాన్ ప్రసాద్కు ఫోన్చేయగా ఆయన ఎత్తలేదు. మరునిముషంలో ఉపమేయర్ మురళీప్రసాద్ మేయర్ పాపాలాల్కు ఫోన్ చేసి ప్రసాద్ తనవద్దే పనిచేస్తున్నాడని, ఈ నెల 22న జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటనను పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
దీనిపై మేయర్ జోక్యం చేసుకుని గత రెండు సమావేశాలకు జవాన్ ప్రసాద్ రాలేదని, అందువల్లే అతనికి ఫోన్చేశామని చెప్పడంతో పాటు వెంటనే ప్రసాద్ రాకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఈ తరవాత ఉపమేయర్ ఫోన్చేసినా సమాధానం చెప్పకపోవడంతో ఆయన కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బంది సమావేశంలోకి వెళ్లి మేయర్ పాపాలాల్ను ప్రశ్నించడంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రజలు పాలకవర్గమంటే చీదరించుకునే పరిస్థితి ఏర్పడిందని, సిబ్బందితో పనులు చేయించుకునే స్థితిలో పాలకవర్గం లేకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దీంతో అక్కడే ఉన్న కార్పొరేటర్ హనుమాన్, నాగేశ్వరరావు, పాపారావు, కో ఆప్షన్ సభ్యుడు నరసింహారావు సర్దిచెప్పేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అనంతరం ఉపమేయర్ మురళీప్రసాద్ ఛాంబర్ నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది.