మరో వివాదంలో మేయర్..! కేసీఆర్ పంటికింద రాయిలా పరిణమించిన ప్రథమ మహిళ..!
హైదరాబాద్ : ఏవైనా శుభాలు జరిగితే ఇంటికి కోడలు వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అని సంభోదిస్తూ ఉంటారు. అది ఆనవాయితీగా వస్తోంది కూడా. ప్రస్తుతం మారుతున్న రాజకీయాల్లో ఆ నేత చేరిన వేళ, ఈ నాయకుడు పదవి చేపట్టిన వేళ అని సంభోదిస్తూ చమత్కరించుకునే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. అచ్చం ఇలాంటి చర్చకు తెర తీసారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. మేయర్ కాకముందు నుండే వివాదాలకు పెట్టిన పేరైన విజయలక్ష్మికి సీఎం చంద్రశేఖర్ రావు అనూహ్యంగా నగర ప్రథమ మహిళ పదవిని కట్టబెట్టారు. మేయర్ ఐన మరుక్షణం నుండి ఆవిడ అనూహ్యంగా వివాదాల వార్తల్లో నానుతూనే ఉన్నారు.
వివాదాల విజయలక్ష్మి.. సొంత పార్టీ నేతను బెదిరించిన మేయర్..
కాగా మేయర్ పదవిలోకి రాకముందే తాను పదవిలో ఉన్న ఐదేళ్లు వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నట్టు మీడియా ముందు తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారన్నే లేపాయి. ఆతర్వాత కుక్కకు పూరీ తినిపిస్తూ అదే చేత్తో తానూ తింటూ ఉన్న వీడియోను పోస్టు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు మేయర్ విజయలక్ష్మి. తాజాగా సొంత పార్టీ నేతనే ప్రాణాలు తీస్తానని బెదిరించినట్టు మేయర్ మీద మరో కొత్త ఆరోపణలు ఘొల్లు మంటున్నాయి. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు మరోసారి తలపట్టుకుని కూర్చున్నట్టు తెలుస్తోంది.
అదిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటున్న బాదితుడు.. కేటీఆర్ కు మొరపెట్టుకున్న గులాబీ నాయకుడు..
తనను జైల్లో పెట్టిస్తానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బెదిరించిందని, ఆమె నుంచి ప్రాణహాని ఉందని సిటీ టీఆర్ఎస్ నేత చెట్లపల్లి రామ్ చందర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బంజారా హిల్స్ లో ఓ కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగా, రాఘవేంద్ర కనస్ట్రక్షన్స్ అనే సంస్థ నాలాను కబ్జా చేస్తుండగా, ఆ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని 3 నెలల కిందట ఆర్టీఐ కింద అర్జీని అధికారులకు పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ అంశం పట్ల తర్జన భర్జనలు జరుగుతున్నాయని రాం చందర్ వివరిస్తున్నారు. కాని మద్యలో మేయర్ జోక్యం చేసుకోవడం తనకు అంతుచిక్కడం లేదని అంటున్నారు.
మేయర్ ఫోన్ కాల్ బెదిరింపులు.. భయబ్రాంతులగురైన బాదితుడు..
ఇక ఇదే అంశంపై మేయర్ కలుగజేసుకొని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తనకు కాల్ చేసిందని, పోలీసులను పంపించి అరెస్టు చేయిస్తానని, తనని జైల్లో పెట్టిస్తానని బెదిరింపులకు పాల్పడిందని సిటీ టీఆర్ఎస్ నేత చెట్లపల్లి రామ్ చందర్ వివరించారు. మేయర్ విజయ లక్ష్మి నుండి తనను రక్షించాలని, తనకు న్యాయం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు విజ్ఞప్తి చేసినట్టు రాంచందర్ తెలిపారు. అంతే కాకుండా జరిగిన అంశాన్ని మేయర్ విజయలక్ష్మి అరచకాలను అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానని రామ్ చందర్ చెప్పుకొస్తున్నారు.
అన్నీ వివాదాలే.. ఐదేళ్ల పదవి పూర్తయ్యేది ఎట్ల.? పార్టీలో జరుగుతున్న చర్చ..
కాగా ఇలాంటి పరిణామాలు పార్టీని ఇరుకున పెట్టే విధంగా పరిణమించడమే కాకుండా సీఎం చంద్ర శేఖర్ రావుకు పంటికింద రాయిలా పరిణమించే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. కార్పోరేటర్ గా ఉన్నప్పుడే ఎన్నో వివాదాలకు ప్రత్యక్ష్యంగా కారణమయిన విజయలక్ష్మి మేయర్ అయినప్పటికి తన తీరులో మార్పు రాకపోడం పట్ల గులాబీ శ్రేణులు పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పదవిలో చేరి పట్టుమని పది రోజులు కాకముందే పదుల సంఖ్యలో వివాదాలు, సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోలింగ్స్ ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్ గా పరిణమించాయి. మరి ఎంతో మంది ఎగిరెగిరిపడే నేతలను సీఎం చంద్రశేఖర్ రావు దారిలోకి తెచ్చుకున్న తరుణంలో మేయర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసకుంటారో అన్న అంశం గులాబీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది.