ఎంబిఏ చేసి పట్టపగలే చోరీలు: యువతీయువకులను చితకబాదారు
హైదరాబాద్: ఉన్నత చదువులు చదివిన ఆ యువతీయువకులు విలాసాల కోసం చెడుదారిలో పడ్డారు. జీవితంలో త్వరగా స్థిరపడాలన్న దురాశతో దోపిడీని ఎంచుకున్నారు. దూరపు బంధువు ఇంటికే కన్నం వేయాలని పథకం వేసి అడ్డంగా దొరికిపోయారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన మలక్పేటలో చోటు చేసుకుంది.
అల్వాల్కు చెందిన పెద్ది అమరేందర్రెడ్డి , అతని స్నేహితురాలు ఆకుతోట భార్గవి ఎంబీఏ పూర్తిచేశారు. అమరేందర్రెడ్డి మార్కెటింగ్ చేస్తుండగా, భార్గవి ఖాళీగానే ఉంటోంది. మార్కెటింగ్ చేసే అమరేందర్రెడ్డి అప్పుడప్పుడు తిరుమలా హిల్స్కు వచ్చి వెళ్లేవాడు.
అంత సంపన్న వర్గాలకు చెందిన కుటుంబాలు నివసించే ఈ ప్రాంతంలో దోచుకుంటే పెద్ద మొత్తంలో ధనం లభిస్తుందని, త్వరగా జీవితంలో స్థిరపడి పోవచ్చునని భావించి దోపిడీకి పథకం వేశాడు. అందుకు తన స్నేహితురాలైన భార్గవిని కూడా కలుపుకున్నాడు.
శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఓ బ్యాగులో కారం పొడి ప్యాకెట్ పెట్టుకొని అమరేందర్రెడ్డి, భార్గవి ఇద్దరు ముసుగులు ధరించి తిరుమలా హిల్స్లోని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు సామగణేష్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. తలుపు కొట్టగానే గణేష్రెడ్డి భార్య మాధవీరెడ్డి తలుపు తీశారు.
వెంటనే లోనికి చొరబడి మాధవీరెడ్డి, ఆమె కోడలు శివాని కళ్లలో కారం కొట్టి చితకబాదారు. ఎవరని గట్టిగా అరవడంతో మాధవీరెడ్డిని బలంగా కొట్టడంతో ఆమె పళ్లు విరిగిపోయాయి. మాధవీరెడ్డిని యువతి పట్టుకోగా, శివానీని యువకుడు ఇంట్లో దాచిన డబ్బు, ధనం తెచ్చి బ్యాగులో పెట్టాలని చితకబాదటంతో ఆమె గట్టిగా అరిచింది. దీంతో వారి నోళ్లకు ప్లాస్టర్ అంటించారు.ఇంట్లో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన డబ్బు, ధనం బ్యాగులో పెట్టుకొని పారిపోదామనుకునే సరికి శబ్ధం విని స్థానికులు ఇంటికి చేరుకున్నారు. వారిని చూసి పారిపోయేందుకు యత్నించినా విఫలమయ్యారు.
మాధవీరెడ్డి, శివానీ పరిస్థితిని గమనించిన స్థానికులు యువతీ, యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా యువకుడికి మాధవీరెడ్డి దూరపు బంధువని, అత్త వరుస అవుతుందని పోలీసులు తెలిపారు. గాయపడ్డ మాధవీరెడ్డి, శివానీను చికిత్స కోసం మలక్పేటలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు.