మక్కా ప్రమాదం: బోధన్ వాసి మృతి, హైదరాబాదీలకు గాయాలు
హైదరాబాద్: మక్కా మసీదులో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. బోధన్కు చెందిన షేక్ హైదర్ అలీ ఖాద్రీ (65) అనే వ్యక్తి మక్కా వెళ్లాడు. క్రేన్ కూలి జరిగిన ప్రమాదంలో అతను మరణించినట్లు సమాచారం అందింది.
ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురు హైదరాబాదీలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్కు చెందిన షేక్ ముజీబ్, బజార్ఘాట్కు చెందిన అనీఫ్ దంపతులకు గాయాలయ్యాయని తెలంగాణ హజ్ కమిటీ అధికారులు తెలిపారు.
మక్కా మసీదులో భారీ క్రేన్ కూలడంతో 107 మంది మరణించిన విషయం తెలిసిందే. మక్కా మసీదు వద్ద పరిస్తితిని జెడ్డాలోని భారత కాన్సులేట్ పర్యవేక్షిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. మక్కా మసీదు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
ముస్లింలకు పరమ పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదు (గ్రాండ్ మాస్క్)లో భారీ క్రేన్ కూలిపోవడంతో 107 మంది మరణించారు. దాదాపు 230 మంది గాయపడ్డారు. శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోయింది.