బీజేపీలోకి మక్కా మసీదు పేలుళ్ల తీర్పు ఇచ్చిన జడ్జీ?
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జీ కే రవీందర్ రెడ్డి ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ తీర్పు అనంతరం కొద్ది గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
షాక్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన జడ్జి రాజీనామా, అసలేం జరిగింది?
అయితే, జస్టిస్ రవీందర్ రెడ్డికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ భావాలు, దేశ భక్తి గల పార్టీ అయిన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు రవీందర్ రెడ్డి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపినట్లు తెలిసింది.
బీజేపీ ముఖ్య నేతలు తన వద్దకు వచ్చి పార్టీలో చేరాలని కోరినట్లు ఆయన సదరు మీడియాతో తెలిపారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ రెండ్రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. కాగా, ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను రవీందర్ రెడ్డి కలిసినట్లు సమాచారం.
జాతీయ భావాలున్న బీజేపీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు షాకు రవీందర్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఏమి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపినట్లు సమాచారం. కాగా, ఆయన సేవలను వినియోగించుకునేందుకు పార్టీ కూడా సిద్ధంగా ఉందని కొందరు బీజేపీ నేతలు తెలిపారు.
రవీందర్ రెడ్డి చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ శుక్రవారం వెల్లడించారు. తానేమీ పార్టీ టికెట్ ఆశించడం లేదని, మక్కా మసీదు తీర్పు ఆధారాల ప్రకారమే ఇచ్చానని జస్టిస్ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.
2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు సంభవించగా.. 9మంది ప్రాణాలు కోల్పోయారు. 58మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితులు ఆరోపణలు ఎదుర్కొన్న స్వామి అసీమానంద సహా ఐదుగురిని పేలుడుకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేనికారణంగా నిర్ధోషులుగా ప్రకటించింది ఎన్ఐఏ కోర్టు.