ఫోర్బ్స్లో తెలంగాణ కీర్తి పతాక.. యువ ప్రతిభావంతుల జాబితాలో చోటు.. ఎవరంటే..
అంతర్జాతీయ యవనికపై తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. ఫోర్స్బ్ జాబితాలో తెలంగాణ యువతికి చోటు లభించింది. 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో కీర్తిరెడ్డి చోటు సంపాదించారు. మాస్టర్స్ చేసిన కీర్తి.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు. కీర్తికి చోటు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చిన్న వయసులో చోటు సంపాదించారని ప్రశంసిస్తున్నారు.
ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కీర్తిరెడ్డికి చోటు దక్కింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కుమార్తె కావడం విశేషం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో గ్లోబల్ మాస్టర్స్ పట్టాను కీర్తిరెడ్డి పొందారు. ప్రస్తుతం ఈమె స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రాకింగ్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా కావడం విశేషం.
ఫార్మా కంపెనీల్లో తయారైన వ్యాక్సిన్ గమ్యస్థానాలకు చేరే వరకు నిరంతరం పర్యవేక్షించేలా వ్యాక్సిన్ ట్రాకింగ్ విభాగాన్ని నిర్వహించారు. అయితే అదీ సత్ఫలితాలను కూడా ఇచ్చింది. దీంతో ఆమెను యువ ప్రతిభావంతుల జాబితాకు 'ఫోర్బ్స్' ఎంపిక చేసింది. 24 ఏళ్లకే ప్రపంచస్థాయి గుర్తింపును పొందారు. సొంతంగా బిజినెస్ ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తానని కీర్తిరెడ్డి చెప్పారు.