Medaram Jatara:ఎడ్లబండి నుంచి హెలికాఫ్టర్ వరకు.. చాపర్ టికెట్ ఛార్జీలు ఎంతో తెలుసా..?
వరంగల్: సమ్మక్క సారలమ్మ వేడుకకు మేడారం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మేడారం జాతరలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మేడారం జాతర గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
1998 వరకు ఎడ్లబండి పైనే జాతరకు భక్తులు
1998కు వరకు మేడారం జాతరకు భక్తులు ఎడ్లబండ్లలో చేరుకునేవారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర ఉన్న మేడారం జాతరను 1998లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇక అప్పటి నుంచి మేడారం స్థితిగతులు మారిపోయాయి. రాష్ఠ్రప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా రహదారులను వేసింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కనీస అవసరాలను గుర్తించి ఏర్పాటు చేసింది. ఇందులో భాగగా తాగునీరు సదుపాయం, విద్యుత్, భద్రత, భక్తులు ఉండేందుకు వసతి ఏర్పాట్లు, పార్కింగ్లను ఏర్పాటు చేసింది. ఇక ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో క్రమంగా భక్తుల సంఖ్య కూడా పెరిగింది.
Recommended Video
ఎడ్ల బండి నుంచి హెలికాఫ్టర్ వరకు..
ఒకప్పుడు కేవలం ఎడ్లబండ్లపైనే మేడారం జాతరకు భక్తులు వచ్చేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పుడు అన్ని రకాల వాహనాలపై భక్తులు వస్తున్నారు.రాష్ట్రప్రభుత్వం కూడా మేడారం జాతరకు బస్సులను నడుపుతోంది. ఇక కొంతమంది భక్తులు తమ సొంత వాహనాల్లో జాతరకు చేరుకుంటున్నారు. ఈ ఏడాది మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటి వరకు ఎడ్లబండ్లు, సొంత వాహనాలు, బస్సుల్లో మేడారంకు వచ్చే భక్తులు హెలికాఫ్టర్లో కూడా అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
2010లోనే చాపర్ సేవలు
వరంగల్లోని మామ్నూర్ విమానాశ్రయం నుంచి ఈ హెలికాఫ్టర్ బయలుదేరుతుంది. వాస్తవానికి హెలికాఫ్టర్ సేవలు 2010 నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర టూరిజం శాఖ ఈ హెలికాఫ్టర్లను నడుపుతోంది. 2010లో ఒకసారి వెళ్లి వచ్చేందుకు రూ.6వేల ఛార్జీని వసూలు చేసేది. అయితే ఈ సర్వీసులు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత సర్వీసులను నిలిపివేయడం జరిగింది. ఇక టూరిజం శాఖ తిరిగి 2014, 2016 జాతరకు ప్రవేశపెట్టాలని ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత 2018లో తిరిగి హెలికాఫ్టర్ సర్వీసులను ప్రారంభించింది.
ఈ ఏడాది చాపర్ సేవలు ప్రారంభం
ఇక ఈ ఏడాది తెలంగాణ టూరిజం శాఖ మేడారంకు హెలికాఫ్టర్ సర్వీసులను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్తో కలిసి టూరిజం శాఖ చాపర్ను ప్రారంభించింది. ఈ చాపర్ హైదరాబాదు నుంచి బయలు దేరుతుంది. మేడారం వెళ్లే వారికి రెండు రకాల ప్యాకేజీలను ప్రకటించింది. ఆరుగురిని ఒకేసారి తీసుకెళ్లే ప్యాకేజీ కింద 1.8 లక్షలు కట్టాలి. జీఎస్టీ ఇందుకు అదనం. ఈ ప్యాకేజీలో హెలికాఫ్టర్ చార్జీలు, హైలీప్యాడ్ నుంచి ఆలయం వరకు ప్రత్యేక వాహనం ఆ పై వీఐపీ దర్శనం ఉంటుంది. ఇక రెండో ప్యాకేజీ కింద ఒక్కో వ్యక్తి రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ కింద మేడారం ప్రాంతం వరకు మాత్రమే చాపర్ భక్తులను తీసుకెళుతుంది. ఆదివారం రోజున పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేట విమానాశ్రయం నుంచి జెండా ఊపి మేడారం హెలికాఫ్టర్ను ప్రారంభించారు. బుకింగ్ చేసుకోవాలనుకునే వారు 9400399999 నెంబర్కు ఫోన్ చేసి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
దట్టమైన అడవుల గుండా మేడారంకు భక్తులు
ఒకప్పుడు మేడారం జాతరకు చేరుకునేందుకు భక్తులు కొన్ని రోజుల ముందే వారి స్వగ్రామాల నుంచి బయలుదేరి కాలినడక దట్టమైన అడవుల నుంచి వచ్చేవారు. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాలైన ఖమ్మం, భద్రాచాలం నుంచి వచ్చేవారు గోదావరి నదిని దాటుకుని మేడారంకు చేరుకునేవారు. అయితే కాలక్రమంలో మేడారం జాతరకు ఇలా నడుచుకుంటూ వచ్చేవారి సంఖ్య, ఎడ్లబండిపై వచ్చేవారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. సొంత వాహనాల్లో రావడం, బస్సుల్లో రావడం జరుగుతోంది. ఇక హెలికాఫ్టర్లలో కూడా భక్తులు మేడారంకు చేరుకోవడం ప్రారంభమైంది.