మేడారం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం
హైదరాబాద్ : మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన బూర్గుల రామకృష్ణరావు భవనంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఘనంగా జరగనున్న మేడారం సమ్మక సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చ జరిగింది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మేడారం మహా జాతర తేదీలు ఖరారు ... ఎప్పుడంటే
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. పోలీస్ బందోబస్తు మొదలు బస్సు సర్వీసులు, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అదలావుంటే మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు.
మేడారం జాతర సందర్భంగా వివిధ శాఖలకు కేటాయించే నిధులను సద్వినియోగం చేసుకోవాలసి సీఎస్ సూచించారు. ఆ మేరకు భక్తుల సౌకర్యార్థం ఆ నిధులు వాడుకోవాలని ఆదేశించారు. జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు అడవులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదివరకు మేడారం జాతర సందర్భంగా కనిపించిన లోటుపాట్లను సరిదిద్దుకుని ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎస్. ఈ ఏడాది డిసెంబర్ నాటికే ఆయా శాఖలు తమకు అప్పగించిన పనులు పూర్తి చేయాలని సూచించారు. జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అంతేగాకుండా జాతరకు వచ్చే భక్తులకు సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు.