అద్భుతం, అందుకే వచ్చా: మేడారంలో వెంకయ్య, కేసీఆర్(పిక్చర్స్)
Recommended Video
మేడారం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా మేడారంలో భారీ భద్రత ఎర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి వెంట తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.
మేడారం అద్భుతం
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివాసీ కుంభమేళ మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. మేడారానికి వచ్చి అవతార మూర్తలను దర్శించకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆది,వేద కాలం నుంచి వస్తున్న ఆచారాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మేడారం జాతరపై యావత్ దేశం దృష్టి పడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. మేడారానికి రావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు వెంకయ్య చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జనసమీకరణ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భారీ స్థాయిలో జనం జాతరకు వస్తున్న తీరు అద్భుతమని వెంకయ్య పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జాతరకు గుర్తింపు రావాలనే తాను మేడారంకు వచ్చానని తెలిపారు.
సన్మార్గంలో ముందుకు
జాతరలు, పండుగలు నిర్వహించి, సన్మార్గంలో ముందుకు వెళ్లడం మంచిదన్నారు. పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారాలను కొనసాగించడం త్యాగమమైన జీవితాన్ని సూచిస్తుందన్నారు. వనదేవతల మార్గంలో నడుచుకుందామన్నారు. గతంలో ఓ సారి సాధారణ పౌరుడిగా జాతరకు వచ్చినట్లు వెంకయ్య గుర్తు చేశారు. అయితే ఈ సారి జాతరలో అద్భుత దృశ్యం కనిపించిందన్నారు. జాతర దేశవ్యాప్తం కావాలని, మరింత గుర్తింపు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్సవాలు, పండుగలు అంటే తనకు ఇష్టమని, ఎందుకంటే అవి మన పూర్వీకులు అందించారని, దేశ సమక్యతను, విశిష్టతను అవి చాటిచెబుతాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న మేడారం ఆధ్మాతిక సంపదకు గుర్తింపుగా మిగులుతుందన్నారు. దేవతల ఆరాధనతో జీవితాలు సుఖమయం వెంకయ్య ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని వెంకయ్య అన్నారు. 1986లో మేడారం జాతరను రాష్ట్ర పండుగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. జాతరకు వచ్చిన జనం తమ భక్తిని ప్రదర్శిస్తున్న తీరు ఆకట్టుకున్నదని ఆయన అన్నారు. కొన్ని పండుగలకు ప్రజలు గుర్తింపు ఇస్తారని, కొన్ని ఉత్సవాలకు రాష్ట్రాలు గుర్తింపు ఇస్తాయని, మేడారం వన జాతరకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రావాల్సి ఉందన్నారు.
కుటుంబసమేతంగా కేసీఆర్..
మేడారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్ వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి వనదేవతలకు సమర్పించారు. సీఎం కుటుంబసమేతంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సీఎం సతీమణి శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
నిలవెత్తు మొక్కులు
తెలంగాణలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకాలు కలగొద్దని సమ్మక్క, సారలమ్మలను వేడుకున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ శుక్రవారం కుటుంబసమేతంగా వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనం సమ్మక్క సారక్క అన్నారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తయేలా చూడాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు చెప్పారు. మేడారం జాతరలో సదుపాయాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
జాతీయ పండుగగా.. శాశ్వత ఏర్పాట్లు
మేడారంలో 200 ఎకరాల స్థలంలో శాశ్వత ఏర్పాట్లు చేయాల్సిన అవసరముందని, 15 రోజుల్లో భూసేకరణపై మళ్లీ చర్చిస్తామన్నారు. జాతరను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరముందని సీఎం తెలిపారు. సమైక్యపాలనలో అన్ని నిర్లక్ష్యానికి గురైనట్లే సమ్మక్క జాతరను కూడా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మేడారం జాతరను జాతీయపండుగగా గుర్తించాలని ప్రధానిని కోరతానన్నారు. ఆనాడు తెలంగాణ సిద్ధించాలని కోరుకునా. భవిష్యత్లో జాతరను చూసి అబ్బురపడేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మేడారం జాతర కోసం రూ.200కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామని కేసీఆర్ అన్నారు.