ఘనంగా ప్రారంభమైన మేడారం మినీ జాతర .. నాలుగు రోజుల పాటు సాగే వనజాతర
గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా ప్రారంభమైంది. జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది.
రెండేళ్లకోసారి మహా జాతర ... మహాజాతర మధ్యలో వచ్చేది మినీ జాతర
రెండేళ్ల కు ఒకసారి మహా జాతర జరగగా మహా జాతర జరగని సంవత్సరం మినీ జాతర జరుగుతుంది. గతేడాది మేడారం మహా జాతర చాలా ఘనంగా జరిగింది. కోట్లాది మంది ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవారాలను దర్శించుకునేందుకు మేడారం వస్తారు. వనమంతా జనసంద్రమైన వేళ అమ్మవార్లను గద్దెల మీదకు తీసుకు వస్తారు. భక్తులు పూనకాలతో ఊగిపోతారు. శివశక్తుల చిందులతో కోలాహలంగా అమ్మవార్ల జాతర కుంభమేళాను తలపిస్తుంది. ఇక మహా జాతర తర్వాత సంవత్సరం మినీ జాతర జరుగుతుంది.ఇప్పుడు ములుగు జిల్లాలో మేడారం మినీ జాతర ఘనంగా ప్రారంభమైంది.
ఘనంగా ప్రారంభమైన మేడారం మినీ జాతర .. అధికారుల ఏర్పాట్లు
మేడారం చిన జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జాతర ఘనంగా జరుగుతోంది. మేడారం మినీ జాతర నాలుగు రోజుల పాటు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. జాతర సందర్భంగా భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తతెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మేడారం చిన్న జాతరకు 5 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగు రోజుల పాటు సాగనున్న జాతర ... జనసంద్రంగా మేడారం
నేటి నుండి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర లో మండమెలిగే పండుగతో జాతరను ప్రారంభించి, సమ్మక్క సారలమ్మలకు పూజలు నిర్వహించి, భక్తులు మొక్కులు చెల్లింపు చేసి, అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అసంఖ్యాకమైన ప్రజలతో మేడారం వనమంతా జనసంద్రంగా మారుతుంది. నాలుగు రోజులపాటు భక్తులు గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని బెల్లాన్ని బంగారంగా నివేదించి మొక్కులు చెల్లించుకుంటారు.