మేడారం మినీ జాతర ముగిసినా ... భక్త జన సంద్రంగా మేడారం
మేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మినీ జాతర 23 వ తేదీతో ముగిసినప్పటికీ మేడారానికి భక్తులు మాత్రం పోటెత్తుతున్నారు. ఆదివారం అందరికీ సెలవు దినం కావడంతో మేడారం భక్త జన సంద్రమైంది. ఒకపక్క పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరోపక్క భక్తుల రాకను గమనించిన అధికారులు సదుపాయాలను కొనసాగించారు.
ఆదివారం నాడు పోటెత్తిన భక్తులు
ఆదివారం నాడు మేడారం భక్తులతో సందడిగా మారింది. జంపన్న వాగు స్నానఘట్టాల వద్ద స్నానమాచరించిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో, సకుటుంబ సపరివార సమేతంగా తల్లులను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నారు. మినీ జాతర కోసం నాలుగు రోజుల పాటు ఏర్పాటుచేసిన అధికారులు భక్త జన ప్రవాహం కొనసాగుతుండటంతో సదుపాయాలను సైతం కొనసాగించారు.
ముగిసిన జాతర ...అమ్మవార్లను దర్శించుకున్న 2 లక్షలకు పైగా భక్తులు
ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 23 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతర లో తొలి రెండు రోజులు మండమెలిగే పండుగతో జాతరను ప్రారంభించారు అమ్మవార్ల పూజారులు . 21 న అమ్మవార్లను గద్దెలపై తీసుకువచ్చారు.ఇక 22 న సమ్మక్క సారలమ్మలకు పూజలు నిర్వహించారు భక్తులు. 23 న భక్తులు మొక్కులు చెల్లింపు చేసి, అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం జాతర ముగిసింది. మినీ జాతరకు సైతం వచ్చిన రెండు లక్షల భక్తులతో మేడారం వనమంతా జనసంద్రంగా మారింది . నాలుగు రోజులపాటు భక్తులు గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని బెల్లాన్ని బంగారంగా నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు.
కొనసాగుతున్న పారిశుద్య పనులు ... శాశ్వత వసతులు కల్పించాలని భక్తుల డిమాండ్
ఇక మేడారం లో భక్తులు వదిలివెళ్లిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు అధికారులు. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా రోడ్లను శుభ్రం చేయడమే కాకుండా, జాతర ప్రభావం వల్ల ఎవరికి ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఒకప్పుడు జాతర రోజుల్లోనే పరిమితమైన భక్తుల సందర్శన ఇప్పుడు ప్రతి రోజు కొనసాగుతుండడంతో భక్తులు మేడారంలో శాశ్వత ప్రాతిపదికన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అమ్మవార్ల ద్దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. అంతేకాకుండా చాలా విశిష్టంగా భావించే మేడారం జాతరను వచ్చే మహా జాతర నాటికైనా జాతీయ పండుగ గా గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు.