మీడియా 'బ్లండర్ మిస్టెక్': ఆ ఫోటోలో ఉన్నది కెల్విన్ కాదు, నాగబాబు అనే..
తాను బెంగుళూరుకు చెందిన వ్యక్తినని, తన ఫోటోను చూపిస్తూ మీడియాలో 'కెల్విన్' అంటూ ప్రచారం జరుగుతోందని వాపోయాడు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. నిజానికి కెల్విన్ అంటూ మీడియా ప్రచారంలో ఉన్న ఫోటో.. బెంగుళూరుకు చెందిన నాగబాబు అనే వ్యక్తిది అని తేలింది.
ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే.. ఆయా మీడియా సంస్థలకు ఫోన్ చేసి మరీ చెప్పినట్లు సమాచారం. తాను బెంగుళూరుకు చెందిన వ్యక్తినని, తన ఫోటోను చూపిస్తూ మీడియాలో 'కెల్విన్' అంటూ ప్రచారం జరుగుతోందని వాపోయాడు. ఇది సబబు కాదని, దయచేసి తన ఫోటోను ప్రసారం చేయడం ఆపేయాలని కోరినట్లు తెలుస్తోంది.
పూరిని రౌండప్ చేసిన మీడియా: ఊపిరాడట్లేదు.. ఫ్రస్టేషన్ లోనే ఆ నింద?
అది తన ఫోటోనే అన్న ఆధారాలు కావాలంటే.. తన ఈమెయిల్ ఐడీ, బ్యాంక్ ఖాతా, ఫేస్ బుక్ ఖాతాలను పరిశీలించాలని కూడా నాగబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
కాగా, సిట్ విచారణలో భాగంగా దర్శకుడు పూరి జగన్నాథ్ ను విచారిస్తున్న క్రమంలో.. జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్ ఫోటోలను అధికారులు బయటకు తీశారు. ఈ ఫోటోల్లో కెల్విన్ ఉన్నట్లు వారు గుర్తించడంతో.. అతనితో సంబంధాలపై పూరిని ఆరా తీశారు. అయితే విచారణ అధికారుల వద్ద ఉన్న ఫోటో ఏదో తెలియదు గానీ మీడియాలో ప్రసారమవుతున్న ఫోటోలో మాత్రం.. రెడ్ బ్లూ కాంబినేషన్ లో టీషర్టు ధరించిన వ్యక్తే కెల్విన్ అన్న ప్రచారం సాగింది.
నాగబాబు ఫోన్ నేపథ్యంలో.. ఇప్పుడదంతా వట్టిదే అని తేలిపోయింది. నిజనిజాలు నిర్దారించుకోకుండా మీడియా మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.